Begin typing your search above and press return to search.

వైసీపీనే షేక్ చేస్తున్న విషయమిదీ!

By:  Tupaki Desk   |   24 Feb 2020 11:30 AM IST
వైసీపీనే షేక్ చేస్తున్న విషయమిదీ!
X
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఫ్యాన్ గాలికి అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ గల్లంతైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లను దక్కించుకొని పాలనా పగ్గాలను చేపట్టింది. అయితే అధికారం లోకి వచ్చి ఏడాది కూడా కాకముందే వైసీపీ లో వర్గపోరు మొదలవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనుండటంతో వైసీపీలో నెలకొన్న వర్గపోరు ఏ మలుపు తిరుగుతుందోనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



* వైసీపీలో ‘స్థానిక’ చిచ్చు..

వైసీపీలో స్థానిక ఎన్నికలు చిచ్చుపెట్టేలా ఉన్నాయి పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్లో సమన్వయం కొరవడినట్లు తెలుస్తోంది. పార్టీలోని నాయకులు ఎవరికీ వారే యమునా తీరు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకులకు పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. పార్టీ కోసం కష్టపడినవారిని కాకుండా టీడీపీ వచ్చిన నాయకులు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వైసీపీ నేతల ఆశలకు కొత్తగా పార్టీ లో చేరినవారు గండి కొడుతున్నారని బహిరంగం గానే ఆరోపిస్తున్నారు.

పామూరులో వైసీపీకి చెందిన ఓ నేత ఎప్పటి నుంచో సర్పంచ్ పదవీకి పోటీ చేసేందుకు డబ్బులు ఖర్చుపెడుతూ ప్రజల్లో ఉంటున్నాడు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాడు. అయితే ఇటీవల టీడీపీ చెందిన మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరాడు. ఈ కొత్త నేత తనకు అనుకూలమైన వారిని సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దింపనుండటంతో అప్పటివరకు డబ్బులు ఖర్చు చేసిన నేతల పరిస్థితి డోలాయమానంగా మారింది. దీంతో వైసీపీ లో వర్గ పోరుకు తెరలేచింది.

ఈ ఒక్క ఉదాహరణే కాదు.. రాష్ట్ర వ్యాప్తం గా టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి వచ్చి అధికార వైసీపీలో చేరిన వారు మొదటి నుంచి ఉన్న వైసీపీ నేతలు కార్యకర్తలను అణగదొక్కుతున్నారు.ఈ పరిణామం వైసీపీని నమ్ముకొని ఉన్న వారిని రోడ్డునపడేస్తోందని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల పంచాయితీ ముదిరి ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. వైసీపీలో మొదలైన ‘స్థానిక’ వర్గ పోరు పార్టీలో ఏ మలుపు తీసుకుంటుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధిష్టానం దీనిపై దృష్టి సారించకపోతే భవిష్యత్లో ఇబ్బంది పడక తప్పదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.