Begin typing your search above and press return to search.

జేసీపై మీసం తిప్పిన సీఐ!... వైసీపీలో జాయిన్‌!

By:  Tupaki Desk   |   26 Jan 2019 9:47 AM GMT
జేసీపై మీసం తిప్పిన సీఐ!... వైసీపీలో జాయిన్‌!
X
అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో నేడు ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌, అనంత‌పురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డినే ఢీకొట్టిన స‌త్తా క‌లిగిన పోలీసు అధికారిగా పేరున్న క‌దిరి మాజీ సీఐ గోరంట్ల మాధ‌వ్‌... కాసేప‌టి క్రితం వైసీపీలో చేరిపోయారు. పోలీసు అధికారుల సంఘం నేత‌గా ఉన్న మాధ‌వ్‌... గ‌తంలో పోలీసుల గౌర‌వానికి భంగం వాటిల్లేలా జేసీ వ్య‌వ‌హ‌రించిన సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దురుసుగా వ్య‌వ‌హ‌రించే నేత‌గా ప్ర‌సిద్ధికెక్కిన నేత అయిన జేసీతో వైరం పెట్టుకుంటే అంతే అనుకునే స‌మ‌యంలోనే మాధ‌వ్‌... పోలీసుల ఆత్మ గౌర‌వం దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తే స‌హించేది లేద‌ని జేసీ బ్ర‌ద‌ర్స్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చి సంచ‌ల‌నం రేపారు. ఆ త‌ర్వాత జేసీ కూడా మాధ‌వ్ పైకి ఓ మోస్త‌రు సెటైర్లు వేసినా... పోలీస్ ప‌వ‌ర్ ఏమిటో తెలిసి సైలెంట్ అయిపోయారు.

ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ... మాధ‌వ్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. జేసీకి వార్నింగ్‌, ఆ వెంట‌నే ఉద్యోగానికి రాజీనామా అంటే.. జేసీ బ్ర‌ద‌ర్స్ బెదిరింపుల‌కు త‌ట్టుకోలేకే ఆయ‌న త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి ఉంటార‌న్న వాద‌న వినిపించింది. అయితే అప్ప‌టికే పోలీసు ఉద్యోగుల సంఘంలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించిన మాధ‌వ్‌... రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకే ఉద్యోగానికి రాజీనామా చేశార‌ని స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించిన‌ట్టుగా వార్త‌లు వినిపించాయి. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ కాసేప‌టి క్రితం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో మాధ‌వ్ వైసీపీలో చేరిపోయారు. పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన మాధ‌వ్‌ రాజకీయాలను అడ్డంపెట్టుకొని దందాలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించార‌న్న పేరు సంపాదించారు. ఆ కమిట్‌మెంట్, నిజాయితీలే ఆయనకు ప్రజల్లో ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టాయి.

వైఎస్‌ జగన్‌ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీని చేరువ చేయడానికి కృషి చేస్తానని, అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. పార్టీలో చేరిన మాధ‌వ్‌కు జ‌గ‌న్ మంచి ప్రాధాన్య‌మే ఇవ్వ‌నున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. హిందూపురం లోక్ స‌భ స్థానం నుంచి మాధ‌వ్ పోటీ చేస్తార‌ని చాలా రోజుల నుంచి ప్ర‌చారం సాగుతోంది. ఆ దిశ‌గా జ‌గ‌న్ ఆయ‌న‌కు అవ‌కాశం ఇస్తారో, లేదో చూడాలి. ఏదేమైనా మాధ‌వ్ పొలిటికల్ ఎంట్రీ... జేసీ బ్ర‌ద‌ర్స్‌కు పెద్ద దెబ్బ‌గానే రాజ‌కీయ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు.