Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల దౌర్జన్యాలు చూస్తున్నారా బాబూ?

By:  Tupaki Desk   |   6 Oct 2017 12:53 PM GMT
త‌మ్ముళ్ల దౌర్జన్యాలు చూస్తున్నారా బాబూ?
X
ఎన్నిక‌లకు ఏడాదిన్న‌ర మాత్ర‌మే స‌మ‌య‌ముంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఎలాగోలా గ‌ట్టెక్కిన టీడీపీకి ఇప్పుడు అంత ఈజీగా అధికారం ద‌క్క‌ద‌ని దాదాపుగా తేలిపోయింది. అప్పుడంటే.. కొత్త రాష్ట్రం, లెక్క‌లేన‌న్ని అమ‌లు కాని హామీలను గుమ్మ‌రించిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఎలాగోలా గ‌ట్టెక్కేశారు. అయితే నాడు ఇచ్చిన హామీల్లో చాలా వాగ్దానాలు ఇంకా హామీలుగానే ఉన్నాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నిస్తున్న ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ నేత‌ల‌ను నిల‌దీస్తున్న వైనం చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోమారు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేన‌న్న భావ‌న‌లో... వైసీపీ నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైసీపీ త‌ర‌హాలో టీడీపీ కూడా ఇంటింటికీ టీడీపీ పేరిట ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు దోహ‌దం చేయ‌నున్న ఈ కార్య‌క్ర‌మాన్ని పార్టీ నేత‌లంతా చాలా సీరియ‌స్‌ గా తీసుకోవాల‌ని స్వ‌యంగా చంద్రబాబు ఇప్ప‌టికే ప‌లుమార్లు దిశానిర్దేశం చేశారు.

అయితే పార్టీ నేత‌ల‌ను ప‌క్క‌న‌బెడితే... చంద్రబాబు సొంత బామ్మ‌ర్ది - అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ టీడీపీ కార్య‌క‌ర్త‌లు - త‌న అభిమానులు అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించేస్తున్నారు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వంతు వ‌చ్చింది. ఇంటింటికీ టీడీపీలో భాగంగా త‌న‌ను ప్ర‌శ్నించిన ఓ మ‌హిళ‌పై విరుచుకుప‌డ్డ ఆమంచి... ఆ మ‌హిళ‌పై వీరంగం చేయ‌డంతో పాటు ఆమెకు జీవ‌నాధారంగా ఉన్న తోపుడు బండీని పోలీస్ స్టేష‌న్‌ కు త‌ర‌లించేశారు. ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం సాయంత్రం వాడరేవు తీరం వద్ద పర్యటించారు. తీరం వద్ద చెత్తాచెదారం ఉండటంతో అక్కడ బండి మీద చేపలు అమ్ముకుంటున్న మత్య్సకార మహిళ కొండూరి అంజమ్మను పిలిచి చెత్తను ఇక్కడ ఎందుకు వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తామెందుకు చెత్త వేస్తామని ఆమె తిరిగి ప్రశ్నించింది. అంతేకాకుండా సర్పంచ్‌ లు - ఎంపీటీసీ సభ్యులు - ఎమ్మెల్యేలు ఉన్నా తమకేమీ ఉపయోగపడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే *నోరు జాగ్రత్తగా పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా.. అసలు బండిపై చేపలు పెట్టుకునేందుకు పంచాయతీ అనుమతి ఉందా?* అంటూ ప్రశ్నించారు. ఇక్కడ పెట్టుకున్న బండ్లు లైసెన్సులు లేవని ఆమె అనడంతో ఆవేశానికి గురైన ఎమ్మెల్యే బండిని పంచాయతీ కార్యాలయంలో పెట్టమని రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డిని ఆదేశించారు. *నువ్వు కావాలనే గొడవ చేసేందుకు వచ్చావు, నాతోనే వాదన పెట్టుకుంటావా?* అంటూ ఆమంచి ఆవేశంతో ఊగిపోయారు. చేపల బండిని ట్రాక్టర్‌ పై తీసుకెళ్లి పంచాయతీ కార్యాలయంలో పెట్టారు. ఆవేదనకు గురైన ఆమె తాము ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కావడంతోనే బండి తీసేశారని, మిగిలిన బళ్లను అక్కడే ఉంచారని ఆరోపించింది. సమస్యలపై ప్రశ్నించినందుకు తన పొట్టపై కొట్టారని అంజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.