Begin typing your search above and press return to search.

చీరాల టీడీపీ గేట్లు తెరచే ఉన్నాయట‌...?

By:  Tupaki Desk   |   29 Sep 2022 4:30 PM GMT
చీరాల టీడీపీ గేట్లు తెరచే ఉన్నాయట‌...?
X
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ గట్టి సంకల్పంతో ఉంది. చావో రేవో అన్నట్లుగా టీడీపీ పరిస్థితి ఉంది. గెలిస్తే మరి కొన్ని దశాబ్దాల పాటు సైకిల్ పరుగులు తీస్తుంది. పసుపు జెండా కూడా రెపరెపలాడుతుంది. దాంతో ప్రతీ సీటు విషయంలో టీడీపీ ఆచీ తూచీ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది.

అలా కనుక చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల టీడీపీకి కీలకమైన సీటుగా ఉంది. ఈ సీటు విషయంలో మళ్ళీ గెలుపు గుర్రమెక్కేందుకు పక్కా స్ట్రాటజీతో టీడీపీ ముందుకు సాగుతోంది. ఇక్కడ టీడీపీకి బలం ఉందా అంటే చాలానే ఉంది అని చెప్పాలేమో.

దానికి ఉదాహరణం 2014 ఎన్నికల్లో ఇక్కడ మూడవ స్థానంలోకి పడిపోయి ఇండిపెండెంట్ గా నాడు పోటీకి దిగిన ఆమంచి క్రిష్ణమోహన్ చేతిలో ఓడిన పార్టీ అదే క్రిష్ణ మోహన్ని వైసీపీ ఊపులో జగన్ ప్రభంజనంలో ఓడించేయడం అంటే బలమే కదా.

అయితే ఇక్కడ పోటీ చేసింది కూడా ఆషామాషీ నేత కాదు, పొలిటికల్ బిగ్ షాట్. కరణం బలరాం అనే రాజకీయ యోధుడు టీడీపీ తరఫున బరిలోకి నిలిచి ఆమంచిని ఓడించారు. అయితే కరణం బలరాం ఆ తరువాత టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఇక అక్కడ ఓడిన క్రిష్ణమోహన్ ఎటూ ఉన్నారు. వీరిద్దరితో పాటు టీడీపీలో ఉన్న పోతుల సునీత కూడా వైసీపీకే జై కొట్టారు.

ఒక విధంగా చూస్తే టీడీపీకి ఇపుడు క్యాడర్ ఉన్నా లీడర్ సరైన వారు లేని పరిస్థితి అంటున్నారు. దాంతో అపుడెపుడో టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ కి పోటీ చేసి ఓడిన కొండయ్య అనే విద్యా సంస్థల అధినేతను ఇంచార్జిగా చేశారు. ఆయన ఈ మధ్య కాలమంతా రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. ఆయన ఇపుడు ఇంచార్జి కాగానే సహజంగా ఆశలు ఉంటాయి.

అయితే ఆయన్ని అలా అక్కడ పెట్టి ఉంచారు తప్ప ఎన్నికల్లో టికెట్ ఇస్తారని కాదు అని కొత్తగా ఇపుడు మరో ప్రచారం ముందుకు వస్తోంది. వైసీపీని ఢీ కొట్టే గట్టి క్యాడిడేట్ కోసం చూస్తున్నారు అని అంటున్నారు. అంటే వైసీపీ వైపే ఆ చూపు ఉందని చెబుతున్నారు. అవును మరి అందరు నాయకులూ వైసీపీలోకి చేరిపోయారు కాబట్టి అక్కడ టికెట్ దక్కని వారు ఈ వైపునకు వస్తారని టీడీపీ చీరాలలో పేరాశ పడుతోంది అని అంటున్నారు.

వైసీపీలో ఆమంచికి టికెట్ ఇస్తే పోతుల సునీత, కరణం బలరాం కొడుకు వెంకటేష్ పూర్తి నిరాశపడతారు. దాంతో వారు టీడీపీలోకి వస్తారని ప్రచారం సాగుతోందిట. అయితే టీడీపీకి వైసీపీలోకి వెళ్ళిపోయిన వారు వచ్చినా వాడుకుంటారు తప్ప టికెట్ ఇవ్వరని మరో ప్రచారం కూడా ఉంది. దానికి కారణం దగ్గుబాటి వారి వారసుడు చెంచురాం ఈసారి టీడీపీ అభ్యర్ధిగా చీరాల బరిలో నిలబడుతున్నారుట.

ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో చిన్నల్లుడు చంద్రబాబు మంచి రిలేషన్స్ ఈ మధ్య కుదుర్చుకున్నారు అని అంటున్నారు. దాని ఫలితమే చెంచురాం పోటీ అని తెలుస్తోంది. చెంచురాం దిగితే మాత్రం టఫ్ ఫైట్ చీరాలలో నడిచే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ వైసీపీకి వల విసురుతూనే తమ వైపు నుంచి గట్టి అభ్యర్ధినే దించాలని అనుకుంటోందిట. సో చీరాల వైపు ఈసారి ఏపీ అంతా చూసే పరిస్థితి ఉంది అన్న‌ మాట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.