Begin typing your search above and press return to search.

రత్నాచల్ మంటల వెనుక ఆయనున్నారా?

By:  Tupaki Desk   |   1 Feb 2016 10:27 AM GMT
రత్నాచల్ మంటల వెనుక ఆయనున్నారా?
X
తునిలో కాపు గర్జన సందర్బంగా జరిగిన విధ్వంసం- భారీ అల్లర్లు- నష్టానికి కారణం వైసీపీయే అని ఆరోపిస్తున్న టీడీపీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కారకులెవరన్నది నేరుగా వెల్లడించింది. ఏపీ హోం మంత్రి ఈ విషయంపై తమ వద్ద సాక్షాలున్నాయని చెబుతూ విధ్వంసం వెనుక వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి హస్తం ఉందని చెప్పారు. అల్లరి మూకలకు ఆయన డబ్బిచ్చి పంపించారని చెప్పారు. అన్నిటీకీ తమ వద్ద ఆధారాలున్నాయని అన్నారు.

తుని విధ్వంసంలో కడప నుంచి వచ్చిన రౌడీలు పాల్గొన్నారని... వారికి డబ్బు సమకూర్చింది భూమన కరుణాకరరెడ్డి అని చినరాజప్ప ఆరోపిస్తున్నారు. అదేసమయంలో సదస్సుకు వచ్చిన ప్రజలను ముద్రగడ రెచ్చగొట్టారని... ఆయన పచ్చి అబద్దాలకోరని ఆయన అన్నారు. ముద్రగడను నమ్ముకుంటే ఇలాగే ఉంటుందని... ఆయన మాటలను కాపు వర్గం ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్వసించరాదని సూచించారు. కాపులకు న్యాయం చేసేది, వారిని బీసీల్లో చేర్చేది చంద్రబాబు మాత్రమేనని చినరాజప్ప చెప్పారు. ముద్రగడ బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కాపు గర్జనకు అన్ని పార్టీలనూ పిలిచి ఒక్క తెలుగుదేశం పార్టీపైనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బాధ్యత లేకుండా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.