Begin typing your search above and press return to search.

చైనా దుమ్ముతో కరోనా..ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి..!

By:  Tupaki Desk   |   25 Oct 2020 7:00 AM IST
చైనా దుమ్ముతో కరోనా..ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి..!
X
కఠిన, నియంతృత్వ విధానాలతో ఉత్తర కొరియాలో కరోనాను చాలా వరకు కట్టడి చేయగలిగారు. దేశంలోని సరిహద్దులను మూసివేసి ‘కనిపిస్తే కాల్చివేత’ వంటి కఠిన నిబంధనలతో ఆ దేశంలో కరోనాను అదుపుచేయగలిగారు. మొదట కరోనాను తేలికగా కొట్టిపారేసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ ఆ తర్వతా సంపూర్ణ లాక్​డౌన్​ విధించాడు. మరోవైపు దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటూ అధికార మీడియా వేదికగా ప్రకటనలు జారీ చేశారు. జూలై 25 తర్వాత తమ దేశంలో తొలి కరోనా కేసు నమోదు అయినట్టు ఆ దేశం ప్రకటించింది. అయినప్పటికీ ఇప్పడు ఆ దేశంలో కరోనా అదుపులోనే ఉన్నది. అయితే ఉత్తర కొరియా అధికార మీడియా జారీ చేసిన మరో ప్రకటన స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. చైనీస్‌, మంగోలియన్‌ ఎడారుల మీదుగా ఉత్తరకొరియా దేశానికి వస్తున్న దుమ్ముదూళితో కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఉత్తరకొరియా హెచ్చరికలు జారీచేసింది. దీంతో బహిరంగ కార్యకలాపాలన్నింటిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది.

ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వడంతో రాజధాని ప్యాంగ్యాంగ్‌ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. ‘దుష్ట, హానికరమైన వైరస్‌ల రాకతో ప్రమాదం పొంచి ఉన్నందున కార్మికులంతా ఇళ్లల్లోనే ఉండాలంటూ’’ అధికార వార్తా పత్రిక ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది. చైనా నుంచి వ్యాపిస్తున్న ఎల్లోడస్ట్​లో కరోనా వంటి ప్రాణాంతాక వైరస్​లు ఉండొచ్చని.. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటనలు విడుదల చేసింది. ప్రజలంతా కిటీకీలు, తలుపులు మూసుకొని ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు దక్షిణ కొరియా మాత్రం ఈ హెచ్చరికలను కొట్టిపారేస్తోంది. దూళికణాల ద్వారా కోవిడ్‌ వ్యాపించే అవకాశం లేదని చెబుతున్నది. ఉత్తరకొరియాతో పాటు తుర్కెమిస్తాన్‌ కూడా తన ప్రజలకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.