Begin typing your search above and press return to search.

భార‌త్ అలా చేయ‌క‌పోతే త‌గ్గేది లేదంటున్న చైనా

By:  Tupaki Desk   |   29 Jun 2017 9:22 PM IST
భార‌త్ అలా చేయ‌క‌పోతే త‌గ్గేది లేదంటున్న చైనా
X
మ‌న‌దేశంపై చైనా మ‌రోమారు బెదిరింపుల ప‌ర్వానికి దిగుతోంది. సిక్కిం సెక్టార్ పరిధిలో డోంగ్‌ లాంగ్ త‌న ప‌రిధిలో ఉంద‌ని అడ్డ‌గోలు వాద‌న చేస్తున్న చైనా తాజాగా హెచ్చ‌రిక‌తో కూడిన స‌మాచారాన్ని అందించింది. సిక్కిం రాష్ట్రంలో భారత్ చైనా- భూటాన్ మధ్య ముక్కోణ జంక్షన్ పరిధిలో గల పాతకాలం నాటి భారత సైనిక బంకర్‌ ను చైనా ధ్వంసం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ బంకర్‌ ను ధ్వంసం చేయాలని ఈ నెల ప్రారంభంలో చైనా చేసిన విజ్ఞప్తిని భారత్ తోసిపుచ్చింది.

అయితే భార‌త్ స్పంద‌న‌తో మండిపోయిన చైనా సైన్యం బుల్డోజర్‌ తో బలవంతంగా ధ్వంసం చేసింది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో భార‌త్ అక్క‌డ త‌న సైన్యాన్ని మోహ‌రించింది. ఈ ప‌రిణామంపై చైనా మ‌రోమారు రియాక్ట‌యింది. ఇరు దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాలంటే తొలుత అక్కడి నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాల్సిందేనని పేర్కొంది. అర్థవంతమైన చర్చలకు ఇది తమ ముందస్తు షరతు చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లు కంగ్ మీడియాతో అన్నారు. సిక్కిం సెక్టార్ పరిధిలో డోంగ్‌ లాంగ్‌ లో నిర్మాణం చట్టబద్ధమేనని సమర్థించుకున్నారు. ఇది తమ భూభాగమేనని, భారత్ గానీ, భూటాన్‌ గానీ జోక్యం చేసుకోరాదని ఆయ‌న తేల్చిచెప్పారు.

మ‌రోవైపు భూటాన్‌ కు స‌మీపంలో ఉన్న ఈ వివాదాస్ప‌ద ప్రాంతాన్ని తాజాగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ సంద‌ర్శించారు. కాగా, ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌ లో దలైలామా పర్యటనతో చైనా కినుక వహించినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/