Begin typing your search above and press return to search.

కుక్కలతో చైనా ఇండియాకు వైరస్ పంపిందా?

By:  Tupaki Desk   |   3 Oct 2016 10:19 AM IST
కుక్కలతో చైనా ఇండియాకు వైరస్ పంపిందా?
X
2011 లో విడుదలయిన సూర్య - సెవెంత్ సెన్స్ మూవీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో చైనా బయో వార్ తో భారతదేశాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఆ క్రమంలో ఆరవ శతాబ్దంలో వచ్చిన ఒక వైరస్ ని మళ్లీ నిద్రలేపి ఇండియాని రోగాలు పాలు చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకు జానీ ట్రై అనే మార్షిల్ ఆర్ట్స్ నిపుణుడ్ని ఇండియాకు పంపుతుంది. అతడు ఇండియాకు వచ్చిన వెంటనే చేసే మొదటి పని, వీది కుక్కలకు ఒక వైరస్ ఇంజెక్ట్ చేయడం. దాని తర్వాత ఆ వైరస్ విపరీతంగా వ్యాపించాలని, దానికి అవసరమైన వ్యాక్సిన్ ని చైనా చెప్పిన ధరకు ఇండియా వారి నుంచి కొనడం.. తద్వారా చైనా భారత్ ను తన ఆధీనంలో పెట్టుకోవడం.. ఇది ఆ సినిమాలో వారి ప్లాన్. తాజాగా చైనా నుంచి వచ్చిన ఒక కంటైనర్ లో దిగుమతి అయిన రెండు కుక్క పిల్లలు ఇలాంటి కలకలాన్నే సృష్టిస్తున్నాయి.

కావాలనే పంపారో లేక అనుకోకుండా వచ్చాయో కానీ చైనా నుంచి దిగుమతి అయిన ఒక కంటైనర్‌ లో రెండు కుక్కపిల్లలు ఉన్నాయి. చెన్నైలోని కాంచీపురం జిల్లా శ్రీపెరుం బుదూర్‌ లో ఒక మొబైల్‌ ఫోన్ సంస్థ ఉంది. ఈ సంస్థకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇదే క్రమంలో తాజాగా యథావిధిగా ఓ కంటైననర్‌ లో ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతి అవుతున్నాయి. అయితే ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న కంటైనర్‌లో రెండు కుక్కపిల్లలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన హార్బర్‌ సిబ్బంది బ్లూక్రాస్‌ కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన వైద్యులతో అక్కడికి చేరుకున్న బ్లూక్రాస్‌ సిబ్బంది కుక్కపిల్లలకు పరీక్షలు నిర్వహించారు. ఇదే సమయంలో భారత్ కు దిగుమతి అయిన ఈ కుక్కపిల్లల ద్వారా చైనా నుంచి వైరస్‌ ను పంపివుండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాటి రక్త నమూనాలను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/