Begin typing your search above and press return to search.

పాక్ కోసం త‌ల్ల‌డిల్లిపోయిన చైనా హృద‌యం

By:  Tupaki Desk   |   8 Sept 2017 6:24 PM IST
పాక్ కోసం త‌ల్ల‌డిల్లిపోయిన చైనా హృద‌యం
X
శ‌త్రువు శ‌త్రువు మిత్రుడు అనే సామెత ఉన్న సంగ‌తి తెలిసిందే. అదే రీతిలో భార‌త్‌ తో సంబంధాల‌ విష‌యంలో త‌మ‌లాగే త‌మ‌లాగే క‌య్యానికి కాల‌వదువ్వుతున్న పాకిస్థాన్‌ తో చైనా బంధం నెరుపుతోంది. తాజాగా త‌న చిర‌కాల మిత్రుడు పాకిస్థాన్‌ ను చైనా మ‌రోసారి వెన‌కేసుకొచ్చింది. ఆ దేశం తీసుకుంటున్న ఉగ్ర‌వాద నిర్మూల‌న చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించింది. ఏకంగా చైనా త్యాగాలు చేసింద‌ని పేర్కొంది.

పాక్ విదేశాంగ మంత్రి ఖ‌వాజా ముహ‌మ్మ‌ద్ ఆసిఫ్‌ తో భేటీ త‌ర్వాత ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ ``పాక్ ప్ర‌భుత్వం - ప్ర‌జ‌లు ఉగ్ర‌వాదంపై పోరులో భాగంగా ఎన్నో త్యాగాలు చేశారు. అవి స్ప‌ష్టంగా క‌నిపిస్తూనే ఉన్నాయి. అంత‌ర్జాతీయ స‌మాజం దానిని గుర్తించాలి. పాకిస్థాన్‌ కు ఆ దిశ‌గా తగిన గుర్తింపు ఇవ్వాలి`` అని అన్నారు. గ‌త నెల‌లో కొత్త‌ ఆఫ్ఘ‌నిస్థాన్ విధానాన్ని ఆవిష్క‌రించిన సంద‌ర్భంగా ఉగ్ర‌వాదుల‌కు పాక్ ఆశ్ర‌య‌మివ్వ‌డాన్ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా త‌ప్పుబట్టిన విష‌యం తెలిసిందే. బ్రిక్స్ కూడా ఇదే చెప్ప‌డంతో ఉలిక్కిప‌డిన పాకిస్థాన్ ఆగ‌మేఘాల మీద చైనాకు ప‌రుగెత్తారు. బ్రిక్స్‌ లో స‌భ్య‌దేశ‌మైన చైనా ఇప్పుడు మాట మార్చి పాక్‌ కు వంత‌పాడ‌టం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు ఉగ్రవాదంపై పాక్‌ అనుసరిస్తున్న వైఖరి మారాల్సిందేనని అమెరికా గట్టిగా కోరింది. చైనాలో 'బ్రిక్స్‌' సమావేశం విజయవంతం కావడంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచంలో కీలకపాత్ర పోషిస్తున్న 'బ్రిక్స్‌' శిఖరాగ్ర సమావేశంలో పాక్‌ లోని ఉగ్రవాద ముఠాలను నియంత్రించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా ప్రతినిధి హర్షం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదుల ముఠాలను నియంత్రించాలని పాక్‌ కు సూచించింది. బ్రిక్స్‌ తీర్మానంలో ఆఫ్ఘన్‌ తాలిబాన్‌ - ఇస్లామిక్‌ స్టేట్‌ - అల్‌ ఖైదా - హక్కానీ ఉగ్రవాదులు - లష్కర్‌ - జైష్‌ ఎ మహమ్మద్‌ - తెహ్రిక్‌ తాలిబాన్‌ పాకిస్థాన్‌ - హిజ్బుల్‌ తహ్రీర్‌ గ్రూపులను ప్రస్తావించారు. 'బ్రిక్స్‌'లో బ్రెజిల్‌ - రష్యా - ఇండియా - చైనా - దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్‌ వేదికగా తొలిసారి పాక్‌ - ఆఫ్ఘన్‌ లోని ఉగ్రవాదుల ముఠాలను నిర్మూలించాలని తీర్మానం చేయడం విశేషం.

ఉగ్రవాదులకు నిధులను సమకూర్చడంతో పాటు ప్రజాసొమ్మును అక్రమ మార్గాల ద్వారా తరలించేందుకు వీలుగా పాక్‌ ఉందని స్విస్‌ అధ్యయనకేంద్రం 'బసెల్‌' తెలిపింది. ఈ విభాగంలో పాక్‌ 46వ స్థానంలో ఉందని వెల్లడించింది. ఇరాన్‌ - ఆఫ్ఘనిస్తాన్‌ - తజికిస్థాన్‌ - లావోస్‌ - మొజాంబిక్‌ - మాలి - ఉగండా - కాంబోడియా... తదితర దేశాలనుంచి మనీలాండరింగ్‌ ఎక్కువగా జరుగుతోందని నివేదికలో వెల్లడైంది. మనీలాండరింగ్‌ నియంత్రణలో ఫిన్లాండ్‌ - లిథ్వేనియా - ఎస్టోనియా - బల్గేరియా - న్యూజిలాండ్‌ - స్లోవేనియా - డెన్మార్క్‌... తదితర దేశాలు కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని 'బసెల్‌' ప్రశంసించింది.