Begin typing your search above and press return to search.

చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు ... ఆ వెయ్యి కోట్లు ఏమైపోయాయ్ !

By:  Tupaki Desk   |   24 Sept 2020 6:30 PM IST
చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు ... ఆ వెయ్యి కోట్లు ఏమైపోయాయ్ !
X
హైదరాబాద్ ‌లో వెలుగు చూసిన రూ.1000 కోట్ల చైనా ఆన్ ‌లైన్‌ బెట్టింగ్‌ యాప్ ‌ల వ్యవహారం ద్వారా ప్రధానంగా ఎవరెవరు లబ్ధి పొందారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. పేటీఎం, హెచ్ ‌ఎస్ బీసీ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా ఎవరెవరికి నిధులు మళ్లాయి అనేది తెలుసుకోవడంపై దృష్టి పెట్టినట్టు ప్రకటించింది. చైనా జాతీయులు స్థాపించిన డాకీ పే టెక్నాలజీ, లిన్ ‌క్యున్‌ టెక్నాలజీ కంపెనీల ద్వారా ఈ స్కామ్‌ జరిగిందని వెల్లడించింది. ఈ - కామర్స్‌ ముసుగులో వందలాది వెబ్ ‌సైట్లను సృష్టించి, వాటి ద్వారా అధిక లాభాల ఆశచూపి అమాయక యువతను సభ్యులుగా మార్చుకొని పలు యాప్ ‌లలోని గేమ్ ‌లపై బెట్టింగ్‌ కట్టించారని వివరించింది.

ఈక్రమంలో బెట్టింగ్‌ చేసే వారి నుంచి డబ్బుల వసూలుకు, వారికి తిరిగి కమిషన్లు చెల్లించేందుకు పేటీఎం, క్యాష్‌ ఫ్రీ యాప్ ‌లను వేదికగా వాడుకున్నారని ఈడీ తెలిపింది. ఇక ఈ వ్యవహారంలో చైనా జాతీయుడు యాన్‌ హో, భారత్‌ లో అతడికి సహకరించిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌ కపూర్ ‌లను సెప్టెంబరు 15నే ఈడీ అరెస్టు చేసింది. ఆ ముగ్గురిని ఎనిమిది రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ హైదరాబాద్ ‌లోని మనీలాండరింగ్‌ వ్యవహారాల ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నిందితులు సూక్ష్మ రుణాల వ్యాపారాన్ని ప్రారంభించేందుకుగానూ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ లైసెన్సు కు దరఖాస్తు చేసుకోగా సంబంధిత నియంత్రణ సంస్థలు తిరస్కరించాయని ఈడీ వెల్లడించడం గమనార్హం.

చైనా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, గురుగ్రాం, ముంబయి, పుణెలోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో నాలుగు హెచ్ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.47 కోట్లు సీజ్ చేశారు. అంతేకాక, ఈడీ అధికారులు 17 హార్డ్ డిస్క్‌లు, 5 ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.