Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరు టెకీల‌కు చైనా బ్యాడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   16 Oct 2017 11:03 AM IST
బెంగ‌ళూరు టెకీల‌కు చైనా బ్యాడ్ న్యూస్‌
X

దౌత్య‌రీతిని మ‌రిచి...స‌రిహ‌ద్దుల్లో క‌ల‌క‌లానికి కార‌ణంగా మారిన పొరుగు దేశం చైనా ఇప్పుడు మ‌నదేశ వ్యవహారాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుతోంది. దేశ అభివృద్ధికి చిహ్నంగా నిల‌వాల్సిన ప్రాజెక్టు ప‌ట్ల త‌న వ‌క్ర‌బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తోంది. త‌ద్వారా భార‌త‌దేశ ఆర్థిక రాజ‌ధానిగా పేరొందిన బెంగ‌ళూరులోని టెకీల‌కు చేదు అనుభ‌వాల‌ను మిగులుస్తోంది. ఇదంతా చైన్నై బెంగళూరు హై స్పీడ్ రైలు ప్రాజెక్టు గురించి. డొక్లాం ముక్కోణ జంక్షన్‌ లో ప్రతిష్ఠంభనతో చైన్నై-బెంగళూరు హై స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులపై చైనా స్పందించడం లేదు. త‌ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు దక్షిణాదితో వేగంగా క‌నెక్ట్ అయ్యేందుకు కంటున్న క‌ల‌ల‌పై నీళ్లు గుమ్మ‌రిస్తోంది.

దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనుల్లో చైనా రైల్వే కంపెనీ అధికారుల నుంచి తగిన స్పందన లేని కారణంగా జాప్యం జరుగుతోంది. సంవత్సరం క్రితమే ఈ ప్రాజెక్టు సాధ్యనీయత అధ్యయనాన్ని పూర్తి చేసిన చైనా రైల్వే కంపెనీ తరువాత భారత అధికారుల ఉత్తరాలకు స్పందించడం లేదు. డోక్లాం ప్రతిష్టంభన కారణంగానే చైనా రైల్వే కంపెనీ అధికారులు ఈ ప్రాజెక్టుపై స్పందించడం లేదని భావిస్తున్నట్టు భారత రైల్వే అధికారులు పేర్కొన్నారు. భారత రైల్వేలు చేపట్టిన తొమ్మిది హైస్పీడ్ ప్రాజెక్టుల స్థితిపై మొబిలిటి డైరెక్టరేట్ తయారుచేసిన ఒక అంతర్గత పత్రం ఈ విషయాన్ని వెల్లడించింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ రాసిన లేఖలకు చైనా రైల్వేలు స్పందించక పోవడం వల్ల 492 కిలో మీటర్ల పొడవున నిర్మించతలపెట్టిన చెన్నయి-బెంగళూరు-మైసూర్ కారిడార్ అసంపూర్తిగా నిలిచిపోయిందని ఈ పత్రం తెలిపింది. ‘ఈ ప్రాజెక్టుకు సంబంధించి చైనా కంపెనీ 2016 నవంబర్‌ లో తుది నివేదికను సమర్పించింది. తరువాత చైనా బృందం ముఖాముఖి చర్చ జరపాలని సూచించింది. అయితే ఇందుకోసం నిర్దిష్టమైన తేదీని ఆ బృందం నిర్ణయించలేదు’ అని మొబిలిటి డైరెక్టరేట్ రూపొందించిన నోట్‌లో ఉంది. చైనా రైల్వే అధికారుల నుంచి స్పందన లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోందని వెల్లడించింది.

చైనా రైల్వే ఎరియుయాన్ ఇంజినీరింగ్ గ్రూప్ కంపెనీ లిమిటెడ్ (సిఆర్‌ఇఇసి) ఈ ప్రాజెక్టు సాధ్యనీయత అధ్యయన వివరాలను 2016 నవంబర్‌లో భారత రైల్వే బోర్డుకు సమర్పించిందని నోట్ వెల్లడించింది. ఆ తరువాత బోర్డు అధికారులతో సమావేశం కావాలని చైనా కంపెనీ కోరింది. గత ఆరు నెలల కాలంలో అనేకసార్లు మెయిల్‌ల ద్వారా సమాచారం పంపించినప్పటికీ సిఆర్‌ ఇఇసి అధికారుల నుంచి తమకు స్పందన రాలేదని రైల్వే బోర్డు అధికారులు తెలిపారు. ఇక్కడున్న చైనా ఎంబసీ ద్వారా కూడా ఆ కంపెనీ అధికారులతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించామని, అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన లేదని రైల్వే బోర్డు అధికారులు వెల్ల‌డించారు.