Begin typing your search above and press return to search.

అబ్బే మేం అలాంటి త‌ప్పుడు ప‌నులు చేయంఃచైనా

By:  Tupaki Desk   |   22 Aug 2017 11:45 AM IST
అబ్బే మేం అలాంటి త‌ప్పుడు ప‌నులు చేయంఃచైనా
X
సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో భార‌త్‌-చైనా దేశాల సైనిక బలగాల మధ్య మూడు నెలల నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే...మ‌న స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా లడఖ్‌ లోని పాంగాంగ్ సరస్సు వద్ద భారత్- చైనా సైనిక బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు - రాళ్ల దాడులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. లడఖ్‌ లో ఈ నెల 15వ తేదీన చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని భారత సరిహద్దు భద్రతా బలగాలు భగ్నం చేయడం రాళ్ల దాడికి దారితీయడంతో ఇరు పక్షాల్లోని కొంతమంది సైనికులకు స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే. త‌న‌దైన మొండివాద‌న‌ను మ‌రోమారు పేర్కొంటూ ఈ ‘హింసాత్మక చర్యల’కు భారత బలగాలే కారణమని చైనా ఆరోపించింది.

ఈ నెల 15వ తేదీన చైనా సరిహద్దు బలగాలు వాస్తవాధీన రేఖ వెంబడి తమ భూభాగంలో ఎప్పటి మాదిరిగానే గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగిందని, భారత బలగాలే హింసాత్మక చర్యలకు దిగి తమ సైనికులను గాయపర్చాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఆరోపించారు. ఈ ఘటనపై భారత్‌ కు నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. డోక్లామ్‌ లో భారత సైనిక బలగాలు చైనా భూభాగంలోకి ప్రవేశించాయని, ఉద్రిక్తతలకు తెరదించాలంటే భారత బలగాలను తక్షణమే అక్కడి నుంచి ఉపసంహరించాలని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కాగా, డోక్లాం ముక్కోణ జంక్షన్‌ లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా ప్రజావిమోచన సైన్యం (పీఎల్‌ ఏ) భారత సరిహద్దుల్లో గతవారం సైనిక విన్యాసాలు జరిపినట్లు చైనా అధికార వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ - టీవీ చానెల్ చైనా సెంట్రల్ వార్తాకథనాలు వెలువరించాయి. డోక్లాం వివాదం గురించి ప్రస్తావించకుండానే మూడు నెలలు సైనికుల శిక్షణ కోసం టిబెట్‌ లో విన్యాసాలు జరిపినట్లు తెలిపాయి.

డోక్లాం వివాద పరిష్కారం కోసం చైనా సానుకూలంగా స్పందిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్ ఎల్లవేళలా శాంతియుత సంబంధాలనే కోరుకుంటుందన్నారు. తమ దేశ సార్వభౌమత్వ పరిరక్షణ తమకు తెలుసునని ఇండో టిబెట్ బోర్డ‌ర్ ఫోర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అన్నారు. పాంగాంగ్ సరస్సు వద్ద జరిగిన ఘటనలపై ఇరు దేశాలకు చెందిన స్థానిక సైనిక కమాండర్లు చర్చించారని పేర్కొన్నారు.