Begin typing your search above and press return to search.

భ‌క్తి ఎక్కువై చిక్కుల్లో ప‌డిన చీఫ్ జ‌స్టిస్‌

By:  Tupaki Desk   |   12 Sep 2017 10:04 AM GMT
భ‌క్తి ఎక్కువై చిక్కుల్లో ప‌డిన చీఫ్ జ‌స్టిస్‌
X
ఒక‌రిపై అభిమానం ఉండ‌టం త‌ప్పేం కాదు. కానీ.. మోతాదు మించితేనే తిప్ప‌ల‌న్నీ. మిగిలిన రంగాల‌కు భిన్న‌మైనదిగా చెప్పే జ్యూడిషియ‌ర్ విభాగంలో ఉన్న వారు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారైతే మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉంటారు. వివాదం త‌మ ద‌రికి కాదు క‌దా.. కిలోమీట‌ర్ దూరంగా ఉండ‌టం క‌నిపిస్తుంది.

సన్నిహితులైన‌ప్ప‌టికీ తొంద‌ర‌ప‌డ‌కుండా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ వివాదాల‌కు దూరంగా ఉంటుంటారు. అలాంటిది ఒక హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ తొంద‌ర‌పాటు ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చేలా మార‌ట‌మే కాదు.. వివాదంగా మారింది. గువ‌హ‌టి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అజిత్ సింగ్ తాజాగా ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌విశంక‌ర్ ను క‌లిసిన వైనం ఇప్పుడు వివాదంగా మారింది.

కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ వ్య‌వ‌హరంలోకి వెళితే.. ఇటీవ‌ల ర‌విశంక‌ర్ గువ‌హ‌టికి వెళ్లారు. ఆయ‌న్ను పిక‌ప్ చేసుకోవ‌టానికి చీఫ్ జస్టిసే ఎయిర్ పోర్ట్‌ కు వ‌చ్చారు. అక్క‌డ నుంచి నేరుగా హోట‌ల్‌కి తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లటం వివాదంగా మారింది. చీఫ్ జ‌స్టిస్ చ‌ర్య‌ను పులువురు త‌ప్పు ప‌డుతున్నారు.

హైకోర్టు నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. రానున్న స‌ర్వ‌స‌భ్య‌స‌మావేశంలో ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తామ‌ని చెబుతున్నారు. మొత్తానికి అధ్యాత్మిక భావ‌న‌తో ర‌విశంక‌ర్ గురూజీ మీద చూపించిన అభిమానం ఇప్పుడు చిక్కుల్లో ప‌డేసింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.