Begin typing your search above and press return to search.

చీఫ్ జ‌స్టిస్ పై విప‌క్షాల అభిశంస‌న‌!

By:  Tupaki Desk   |   28 March 2018 8:03 AM GMT
చీఫ్ జ‌స్టిస్ పై విప‌క్షాల అభిశంస‌న‌!
X
భార‌త న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో మ‌రో క‌ల‌క‌లం చోటుచేసుకునే ప‌రిణామాలు ఉన్నాయ‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టే పనిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ - ఎన్సీపీలు సంతకాల సేకరణలో ఉన్నాయి. ఇప్పటికే 20 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు ఎన్సీపీకి చెందిన మజీద్ మెమన్ వెల్లడించారు. ఇందులో గులాం నబీ ఆజాద్ - కపిల్ సిబల్ - అహ్మద్‌ పటేల్‌ లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఎన్సీపీ నుంచి మరో ఐదుగురు సంతకాలు చేశారు. కేసుల కేటాయింపులో సీనియర్ న్యాయమూర్తులను విస్మరిస్తున్నారని, కొందరికి మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారని ఆ పిటిషన్‌ లో ఎంపీలు ఆరోపించారు.

ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిపై అభిశంసన కోసం తాను కూడా సంతకం చేసినట్లు చెప్పారు. సంతకాల సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. సీపీఎం - సీపీఐ ఎంపీలు కూడా సంతకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీపక్ మిశ్రాపై అవినీతి ఆరోపణలే కాదు అంతకుమించిన తీవ్రమైన అభియోగాలే ఉన్నాయని, ఆయనతో న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ముప్పు పొంచి ఉందని గతంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు చెప్పిన విషయాన్ని త్రిపాఠి గుర్తు చేశారు.

చీఫ్ జస్టిస్‌ పై అభిశంసన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలంటే లోక్‌ సభలో 100 మంది - రాజ్యసభలో 50 మంది ఎంపీల సంతకాలు అవసరమవుతాయి. ఈ అంశంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్‌ ను కలిసి ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు చర్చించారు. తృణమూల్ కాంగ్రెస్ - ఎన్సీపీ - సీపీఎం పార్టీలకు చెందిన నేతలు కొన్ని రోజులుగా దీనిపై చర్చలు జరుపుతున్నారు. సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ తో ఇదే విషయమై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చర్చించినట్లు సమాచారం. ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. అటు సమాజ్‌ వాదీ పార్టీ కూడా తాము ఈ పిటిషన్‌ కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది.