Begin typing your search above and press return to search.

కుంతియా మొహం చాటేశారు..అమ‌ర‌వీరుల వ‌ద్ద ధ‌ర్నా

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:48 PM GMT
కుంతియా మొహం చాటేశారు..అమ‌ర‌వీరుల వ‌ద్ద ధ‌ర్నా
X
కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ - టీజేఎస్‌ లతో ఏర్ప‌డిన మహాకూటమిలో ప్ర‌కంప‌నలు ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. ఓ వైపు త‌మ‌కు కేటాయించిన టికెట్ల‌పై కాంగ్రెస్ నేత‌లు భ‌గ్గుమంటుండ‌గా మ‌రోవైపు మిత్ర‌పక్షాల్లో అస‌మ్మ‌తి చ‌ల్లార‌డం లేదు. మ‌హాకూట‌మిలో మిత్ర‌ప‌క్ష‌మైన తెలంగాణ ఇంటి పార్టీకి ఘోర అవమానం కలిగింది. కూట‌మిలోని మిగ‌తా నాలుగు పార్టీల‌కు సీట్లు కేటాయించినప్పటికీ ఇంటి పార్టీకి మాత్రం కోరుకున్న ఒక్క సీటును కూడా ఇవ్వలేకపోయారు. దీంతో ఇంటి పార్టీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న బాట ప‌ట్ట‌డ‌మే కాకుండా - ఢిల్లీ పెద్ద‌ల‌పై భ‌గ్గుమంటున్నారు.

తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ సీటు ఇవ్వాలని మొదట కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినప్పటికీ.. కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన లాబీయింగ్ వల్ల వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ స్థానాన్ని కేటాయించారు. లింగయ్యకు నకిరేకల్ ఇస్తే మహబూబ్‌ నగర్ స్థానాన్ని కేటాయించాలని ఇంటి పార్టీ నేతలు కోరారు. ఆ స్థానం టీడీపీ అభ్యర్థి ఎర్ర శేఖర్‌ కు కేటాయించడంతో.. ఇంటి పార్టీ దిక్కు తోచని స్థితికి చేరింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క తమను మహాకూటమిలోకి ఆహ్వానించారు. ఆహ్వానించి సీట్లు ఇవ్వకుండా అవమానించడంలో అంతర్యం ఏమిటని ఆయ‌న‌ ప్రశ్నించారు. తమను ఢిల్లీకి పిలిచి అవమానించారే తప్ప పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఒక సీటు కేటాయిస్తానన్న కుంతియా.. మొహం చాటేశారని మండిప‌డ్డారు. అందుకే బుధ‌వారం హైదరాబాద్‌ లో అమరవీరుల స్తూపం వద్ద దీక్షకు దిగుతామని ఆయన తెలిపారు. దీక్ష తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న చెరుకు సుధాకర్.. అవసరమైతే స్వతంత్రంగా బరిలో దిగుతామని ఆయన స్పష్టం చేశారు.