Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్‌ లో మార్పులు...ఆర్థిక‌మంత్రి ప‌ద‌వి ఔట్

By:  Tupaki Desk   |   18 Jan 2020 4:28 PM GMT
మోడీ కేబినెట్‌ లో మార్పులు...ఆర్థిక‌మంత్రి ప‌ద‌వి ఔట్
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కేబినెట్ లో మార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ముఖ్య‌మైన పోర్ట్‌ ఫోలియోల‌ను కొత్త వ్య‌క్తుల‌కు అప్ప‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో అనుభవజ్ఞులైన విధాన కర్తలకు కీలక బాధ్యతలు అప్పజెప్పి ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది. కొత్త ఆర్థిక మంత్రి రేసులో బ్రిక్స్ బ్యాంక్ ప్రస్తుత చీఫ్ కేవీ కామత్ ముందు వరుసగాలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మేర‌కు మార్పులు జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఫిబ్రవరి 1న 2020 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ను ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ తర్వాత కొత్త ఆర్థిక మంత్రి మార్పు ఉండొచ్చనే అంచనాలున్నాయి. బ‌డ్జెట్ అనంత‌రం కేంద్రం నిర్మలా సీతారామన్ స్థానంలోకి కొత్త ఆర్థిక మంత్రిని తీసుకురాబోతోందని తెలుస్తోంది. బ్రిక్స్‌ దేశాల న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంక్‌ అధినేత అయిన కేవీ కామత్‌ కు ఈ అవకాశం ద‌క్కుతుందని స‌మాచారం. క‌ర్నాట‌క‌లోని మంగళూరులో జన్మించిన ఈయన గతంలో ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కు ఛైర్మన్‌ గా పనిచేశారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ - ఎండీ - సీఈవోగానూ వ్యవహరించారు.

గతంలో రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన సురేశ్‌ ప్రభు తిరిగి మోదీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక మంత్రితో పాటుగా బీజేపీ రాజ్యసభ ఎంపీ స్వప్నదాస్ గుప్తాకు కూడా మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈయనకు మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం.