Begin typing your search above and press return to search.

బాబు బందోబస్తులో పోలీస్ తుపాకీ పేలింది

By:  Tupaki Desk   |   3 Jan 2017 4:57 AM GMT
బాబు బందోబస్తులో పోలీస్ తుపాకీ పేలింది
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తుకు వచ్చిన ఒక కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనలో సదరు కానిస్టేబుల్ మరణించారు. ఈ ఉదంతంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అనంతపురం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ హంపన్న (25) స్పెషల్ పార్టీ బృందంలో పని చేస్తుంటారు. సోమవారం తడకనపల్లికి వచ్చిన చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన్ను బందోబస్తు విధులు నిర్వర్తించేందుకు బాధ్యతలు అప్పగించారు. సీఎం సభాస్థలికి అరకిలోమీటరు దూరంలో విధులు నిర్వర్తించిన హంపన్నతో పాటు మరో ఇద్దరుకానిస్టేబుళ్లు సైతం విధులు నిర్వహించారు.

మధ్యాహ్నం 2.30 గంటల వేళలో.. వారంతా భోజనానికి కూర్చున్నారు. ఆ సందర్భంగా హంపన్న సెల్ మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్లిన హంపన్న.. పది నిమిషాల వ్యవధిలో తుపాకీ పేలిన శబ్దం రావటం.. పరుగున వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లకు.. రక్తపు మడుగులో ఉన్న హంపన్న కనిపించారు. ఫోన్ మాట్లాడుతున్న సందర్భంగా అతని తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా? కావాలనే తుపాకీ పేల్చుకున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హంపన్నది మిస్ ఫైరా? లేక.. కావాలనే తుపాకీ కాల్చుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/