Begin typing your search above and press return to search.

కరణం బలరాంను బాబు మోసం చేశారా?

By:  Tupaki Desk   |   11 March 2017 6:55 AM GMT
కరణం బలరాంను బాబు మోసం చేశారా?
X
ఈతకాయ ఇచ్చి తాటికాయ లాగేసుకోవడం అన్న సామెతకు అర్థం ఇప్పుడు తెలిసిందంటున్నారు టీడీపీ నేతలు కొందరు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం, పోతుల సునీతలకు ఇది బాగా అర్థమైందట. చంద్రబాబు తమకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తే మన మంచికే అనుకున్న ఆ నేతలు.. రెండు రోజుల్లోనే చంద్రబాబు తమకు పగ్గాలు వేసి.. తమ నియోజకవర్గాలను ఫిరాయింపు నేతలకు అప్పగించడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు మంచి మిత్రుడుగా ఉన్నా గత కొద్దికాలంగా ఆయన వద్ద నమ్మకం పొందలేకపోతున్న నేత కరణం బలరాం.. అయితే.. రీసెంటుగా మాత్రం చంద్రబాబు బలరాంకు ఎమ్మెల్సీ ఛాన్సిచ్చారు. దాంతో బలరాం బాగా హ్యాపీ ఫీలయ్యారట. కానీ.. ఆ సంతోషం ఎంతో సేపు నిలవనివ్వలేదు చంద్రబాబు. బలరాంకు సొంత నియోజకవర్గంలో కొన్ని కట్టుబాట్లు విధించారు. దీంతో బలరాం మళ్లీ నీరసపడిపోయారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంకు చంద్రబాబు కొన్ని కట్టుబాట్లు విధించారు. వాటిని దాటి వ్యవహరించవద్దని ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో కరణం బలరాం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇకపై అద్దంకి నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెట్టవద్దని కరణం బలరాంకు చంద్రబాబు స్పష్టం చేశారు. అడిగినట్టుగానే ఎమ్మెల్సీగా నియమించానని ఇకపై అద్దంకి వ్యవహారాలను ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ చూసుకుంటారని చంద్రబాబు స్పష్టం చేశారు.

కాగా బలరాం తన వాదన వినిపించేందుకు ప్రయత్నించగా… ఇక చెప్పడానికి, వినడానికి ఏమీ లేదని గొట్టిపాటి రవికుమార్‌కు అడ్డుపడవద్దని సూచించారట. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా గొట్టిపాటే చూసుకుంటారని చంద్రబాబు స్పష్టం చేశారని తెలుస్తోంది.ద ఈ అంశం ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. అద్దంకి నుంచి కరణం బలరాంను తప్పించేందుకే ఎమ్మెల్సీని చేసినట్టుగా ఉందని అభిప్రాయపడుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత… ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా ఉపయోగం ఏమిటని బలరాం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కరణం బలరాం తన కుమారుడిని అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చాను కాబట్టి అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని, అక్కడి వ్యవహారాలను గొట్టిపాటి రవికుమార్ చూసుకుంటారని చంద్రబాబు చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కరణం బలరాం కుటుంబానికి సీటు రాదన్న విషయం స్పష్టమైందంటున్నారు.

బలరాం, గొట్టిపాటి కుటుంబం మధ్య చాలాకాలం ఫ్యాక్షన్ తగాదాలు నడిచాయి. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కోసం కరణం బలరాం అద్దంకి నియోజకవర్గానికి దూరం కావాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.ఈ పరిణామం కరణం బలరాం అనుచరుల్లో ఆందోళన కలిగిస్తోంది. అటు ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీతకు కూడా చంద్రబాబు ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. చీరాల వ్యవహారాలను ఆమంచి కృష్ణమోహన్ చూసుకుంటారని కాబట్టి నియోజకవర్గంలో వేలు పెట్టవద్దని ఆమెకు చంద్రబాబు ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/