Begin typing your search above and press return to search.

మూడున్న‌ర గంట‌ల మీటింగ్ టార్గెట్ జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   16 Feb 2018 11:00 AM IST
మూడున్న‌ర గంట‌ల మీటింగ్ టార్గెట్ జ‌గ‌న్‌
X
కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అస్స‌లు మింగుడుప‌డ‌టం లేదు. తాను ఊహించిన దాని కంటే వేగంగా సాగిపోతున్న వైనానికి ఆయ‌నేం చేయాలో అర్థం కావ‌టం లేదు. ఎత్తులు వేయ‌టంలో త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని ఫీల‌య్యే బాబుకు.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్న వైనం.. జ‌గ‌న్ రాజీనామాస్త్రం బాబును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ నేప‌థ్యంలో ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసం ప‌క్క‌నున్న ప్ర‌జాద‌ర్బారులో పార్టీ నేత‌ల‌తో మీటింగ్ ఏర్పాటు చేశారు.

ఉద‌యం ప‌దిన్న‌ర‌కు మొద‌లైన మీటింగ్ మ‌ధ్యాహ్నం రెండింటి వ‌ర‌కూ నాన్ స్టాప్ గా సాగింది. ఆద్యంతం హాట్ హాట్ గా సాగిన ఈ మీటింగ్ సారాంశం మొత్తాన్ని మూడంటే మూడు అక్ష‌రాల్లో చెప్పాలంటే.. జ‌గ‌న్ గా చెప్పాచ్చు. అదే ప‌నిగా ఏపీ విప‌క్ష నేత నామ‌స్మ‌ర‌ణ‌తో మీటింగ్ సాగింద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ను బుర‌ద జ‌ల్ల‌టంతో పాటు.. లేనిపోని ఆరోప‌ణ‌ల‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏ రీతిలో బ‌ద్నాం చేయాల‌న్న దానిపై త‌న‌దైన రీతిలో భాష్యాలు చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో త‌న‌కు మాత్ర‌మే క‌మిట్ మెంట్ ఉంద‌ని.. మిగిలిన వారెవ‌రూ దాని కోసం పోరాడినా.. దానికి ఏదేదో అర్థాలు.. అపార్థాలు వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేయ‌టం క‌నిపిస్తుంది. జ‌గ‌న్ ఎంపీల రాజీనామా నిర్ణ‌యాన్ని నాట‌కంగా కొట్టిపారేసిన చంద్ర‌బాబు.. త‌న పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర‌మంత్రులుగా ఉండ‌టాన్ని మాత్రం స‌మ‌ర్థించుకున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం.. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిస్తున్న వైనంపై కేంద్ర‌మంత్రులు రాజీనామా చేయ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న మాట బాబు నోటి రావ‌టం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా గ‌తాన్ని గుర్తు తెచ్చుకుంటే.. ఇదే త‌ర‌హా మాట‌ల్ని ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌ల నోటి నుంచి వ‌చ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఏపీ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తినేలా సోనియా అండ్ కో నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని.. వారిపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ఏపీకి చెందిన నేత‌లు త‌మ ప‌ద‌వుల్ని త్యాగం చేసి.. రాజీనామా లేఖ‌ల్ని సోనియాగాంధీ ముఖాన కొట్టాల‌న్న వాద‌న పెద్ద ఎత్తున వచ్చినా.. మేం రాజీనామాలు చేసినంత‌నే విభ‌జ‌న ఆగుతుందా? అంటూ ప‌ద‌వుల్ని కాపాడుకునేందుకు తొండి వాద‌న‌ను తెచ్చిన కాంగ్రెస్ నేత‌ల‌కు త‌గ్గ‌ట్లే తాజాగా బాబు వాద‌న ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం త‌న ఎంపీల చేత రాజీనామా చేయించే విష‌యంలో మొద‌ట్నించి ఒకే మాట చెబుతున్న జ‌గ‌న్ ను మాత్రం.. నాట‌కాలు ఆడుతున్నార‌ని అభివ‌ర్ణించ‌టం బాబుకే చెల్లింద‌ని చెప్పాలి.

కేసుల నుంచి త‌ప్పించుకోవ‌టం కోస‌మే జ‌గ‌న్ బీజేపీకి ద‌గ్గ‌ర అవుతున్న‌ట్లుగా బాబు బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేశారు. గ‌డిచిన కొద్దికాలంగా ఏపీకి హ్యాండ్ ఇస్తున్న మోడీపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితోనూ.. ఆగ్ర‌హంతోనూ ఉన్నారు. ఇలాంటి వేళ‌.. మోడీతో జ‌త క‌ట్టాల‌ని ఏ రాజకీయ పార్టీ అనుకోదు. కానీ.. జ‌గ‌న్ పేరును త‌ర‌చూ బీజేపీతో లింకు పెట్ట‌టం ద్వారా ప్ర‌జ‌ల్ని క‌న్ఫ్యూజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌తోనే బాబు ఈ తీరులో మాట్లాడుతున్నార‌ని చెబుతున్నారు.

త‌న‌కు కేసుల భ‌యం లేద‌ని త‌మ్ముళ్ల‌కు అదే ప‌నిగా చెప్పిన చంద్ర‌బాబు.. తాను ఎవ‌రికి భ‌య‌ప‌డ‌న‌ని చెప్పుకున్నారు. ఒక‌వేళ బాబు చెప్పింది నిజ‌మేన‌ని అనుకుందాం. మ‌రి.. ఏ భ‌యంతో హైద‌రాబాద్ నుంచి ప‌రుగులు పెడుతూ విజ‌య‌వాడ‌కు బాబు వ‌చ్చారో చెబుతారా? ఇదే చంద్ర‌బాబు.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తెలంగాణ‌లో తెలుగుదేశం జెండా ఎగుర‌వేసిన త‌ర్వాతే హైద‌రాబాద్ ను వ‌దిలేస్తామ‌ని ప్ర‌క‌టించి.. ఉన్న‌ట్లుండి ఏదో పూన‌కం వ‌చ్చినోళ్ల మాదిరి ఎందుకు ప‌రుగులు తీశారో చెబుతారా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోటి నుంచి వ‌స్తోంది. అది కూడా.. ఓటుకు నోటు ఉదంతం తెర మీద‌కు వ‌చ్చి.. ఏపీ ముఖ్య‌మంత్రికి తెలంగాణ స‌ర్కారు నోటీసులు ఇస్తుంద‌ని.. బాబు పేరును ఎఫ్ ఐఆర్ లో చేర్చ‌నున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగిన వేళ‌.. బాబు హైద‌రాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఒక‌వేళ‌.. ఈ వాద‌న అంతా త‌ప్పు అనుకుంటే.. కేవ‌లం ఏడాది మాత్ర‌మే హైద‌రాబాద్ లో ఉండాల‌న్న‌దే బాబు ఆలోచ‌న అయితే.. హైద‌రాబాద్ స‌చివాల‌యంలో ఏపీ సీఎం ఛాంబ‌ర్ ను దాదాపు రూ.20 కోట్ల‌తో మ‌ర‌మ్మ‌త్తులు చేయించింది ఎందుక‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే స‌రిపోతుంది. మూడున్న‌ర గంట‌ల పాటు త‌మ్ముళ్ల‌ను చుట్టూ చేర్చుకొని జ‌గ‌న్ పేరును అదే ప‌నిగా ప్ర‌స్తావిస్తూ.. లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ బాబు మాట్లాడిన తీరు చూస్తే.. ఒక విష‌యం గుర్తుకు రాక మాన‌దు. బాబు ఏదైనా విష‌యంలో డిఫెన్స్ లో ప‌డితే.. పార్టీ నేత‌ల్ని చుట్టూ పెట్టుకొని గంట‌ల గంట‌లు మీటింగ్ ల మీద మీటింగులు పెట్టుకోవ‌టం క‌నిపిస్తుంది. ఓటుకు నోటు ఇష్యూ బ‌య‌ట‌కు వ‌చ్చిన వేళ‌.. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు బాబుపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగిన వేళ‌.. బాబు అదే ప‌నిగా మీటింగ్ లు పెట్టుకోవ‌టం గుర్తుకు తెచ్చుకుంటే బాబు మైండ్ సెట్ ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.