Begin typing your search above and press return to search.

మాకేం ప‌నీపాట లేదనుకుంటున్నారా?:బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   3 Aug 2017 7:17 PM IST
మాకేం ప‌నీపాట లేదనుకుంటున్నారా?:బాబు ఫైర్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న ప‌రిపాల‌న ఫీడ్ బ్యాక్‌ పై ఒకింత అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే త‌న‌తో జ‌రిగిన స‌మావేశంలో బాబు ఒకింత అప్‌ సెట్ అవ‌డ‌మే కాకుండా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. తాజాగా ఏపీ సెక్రటేరియట్‌ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జ‌రిగిన‌ సమన్వయ కమిటీ సమావేశంలో ఇదే అభిప్రాయం వ్య‌క్త‌మైన‌ట్లు తెలుస్తోంది. ప‌థ‌కాల వారీగా ఆయా విష‌యాల గురించి వివ‌రించిన చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో మ‌రింత‌గా మెరుగుప‌ర్చుకోవాల‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. మంత్రులు - పార్టీ ముఖ్య నేతలతో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం చంద్రబాబు చర్చించారు.

అయితే కీల‌క స‌మావేశానికి ప‌లువురు నేత‌లు డుమ్మా కొట్ట‌డంపై చంద్ర‌బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. సమావేశానికి రాకుండా మాకు పనులున్నాయ్ అని కొందరు నేతలు సాకులు చెబుతున్నారని బాబు అస‌హ‌నంగా మాట్లాడిన‌ట్లు స‌మాచారం. అందరికీ పనులుంటాయని పేర్కొంటూ పనులేమీ లేకుండా కూర్చుంది తామేనా అంటూ ఆయ‌న ఉగ్ర‌రూపం దాల్చార‌ని తెలుస్తోంది. కాగా, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో జన్మభూమి కమిటీలను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. జన్మభూమి కమిటీలను ప్రక్షాళన చేసి నెలలోపు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం మంత్రులను ఆదేశించారు. అన్న అమృతహస్తంపై సీఎం చంద్రబాబు నాయుడు సర్వే వివరాలు వెల్లడించారు. 67 శాతం మంది ప్రజలు తమకు సరుకులిస్తే ఇంటికెళ్లి వండుకుంటామని తెలిపారని, ఒకచోటకు వెళ్లి తినాలంటే ఇబ్బందిగా ఉంటుందని గర్భిణీలు వెల్లడించినట్లు సీఎం పేర్కొన్నారు. అన్న అమృతహస్తంలో పలు మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని సీఎం టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో తెలిపారు. బెల్ట్‌ దుకాణాల రద్దుపై 95 శాతం మంది సంతృప్తి చెందారని, 100 శాతం సంతృప్తి చెందేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఇసుకపై ప్రజలు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారని, కేవలం 48 శాతం మాత్రమే ఉచిత ఇసుక విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, పూర్తిస్థాయిలో ప్రజలను సంతృప్తి పరిచేందుకు కృషి చేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. జిల్లాలో ఇసుక విధానంపై అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా మార్పులు చేర్పులు చేపట్టాలని సూచించారు.

కాగా, నంద్యాల కళాశాల ప్రిన్సిపల్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సీఎం చంద్రబాబు నాయుడి సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసే పార్టీలో చేరినట్లు వెల్లడించారు. నంద్యాలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.