Begin typing your search above and press return to search.

ఐఏఎస్‌ ల‌ బ‌దిలీలు..బాబు కొత్త ఎజెండా

By:  Tupaki Desk   |   16 April 2017 10:25 AM GMT
ఐఏఎస్‌ ల‌ బ‌దిలీలు..బాబు కొత్త ఎజెండా
X
సుదీర్ఘ కాలం నాన్చిన‌ప్ప‌టికీ ఇటీవ‌లే పూర్తి చేసిన కేబినెట్ పున‌ర్‌ వ్య‌వ‌స్థీక‌ర‌ణ అనంత‌రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ముందుకు సాగుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటం, అధికారుల పెత్తనం వల్ల పార్టీ కార్యకర్తలకు కావలసిన పనులు చేయలేకపోతున్నామని మంత్రులు - ఎమ్మెల్యేలు వాపోతుండటంతో చంద్రబాబు తెరదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వారం రోజుల నుంచి ఏఐఎస్ - ఐపిఎస్ బదిలీలు జరుగుతాయని వార్తలు ఈ రోజు కొలిక్కి వ‌చ్చాయి. ఐఏఎస్‌ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ దినేష్‌ కుమార్‌ - సీఎంవో ముఖ్యకార్యదర్శి సతీష్‌ చంద్రతో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. సుమారు 35 మంది ఐఏఎస్‌ లు బదిలీ అయ్యే అవకాశముంది. కీలకశాఖల ఉన్నతాధికారులకు కూడా స్థానచలనం తప్పేలా లేదని అంటున్నారు. సుమారు 9 మంది కలెక్టర్లు బదిలీ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఈ ఎపిసోడ్‌ లో జిల్లాల్లో కలెక్టర్లు - ఎస్పీలను ఎవరిని తీసుకోవాలన్న విషయాన్ని ఆయా జిల్లాల మంత్రుల అభిప్రాయాలకే వదిలేయాలని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారని చెబుతున్నారు. చివరకు మంత్రుల శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలు - కమిషనర్ల నియామకాల విషయంలో కూడా వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సొంత చిత్తూరు జిల్లాలో కలెక్టర్ సిద్ధార్థ జైన్‌ పై జిల్లా నేతలంతా మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి ఆయనను మార్చాలని చెప్పి, చివరకు జెడ్పీ సమావేశాన్ని సైతం బహిష్కరించే పరిస్థితి నెలకొన్నా స్పందించని బాబు, ఆయనతో సర్దుకుపోవాలని చెప్పిన వైనాన్ని ఆ జిల్లా నేతలు గుర్తుచేస్తున్నారు. తూర్పు-పశ్చిమ జిల్లాల కలెక్టర్లను మార్చాలని అక్కడి ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక ప్రకాశం జిల్లా కలెక్టర్ మంత్రులు - ఎమ్మెల్యేలను ఖాతరు చేయకుండా నెలల తరబడి ఫైళ్లు పెండింగ్‌ లో పెట్టి కాలయాపన చేస్తున్నారని బాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం అనే భావ‌న ఉంది.

ఎన్నికల్లో అధికారులు ప్రజలతో ఓట్లు వేయించరని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి పాటపాడే అధికారులను నెత్తిన ఎక్కించుకుని, ఎన్నికల్లో జనంతో ఓట్లు వేయించే పార్టీ నేతలను అధినాయకుడే గౌరవించకపోతే అధికారులు మాత్రం ఎందుకు గౌరవిస్తారన్న ప్రశ్నలు పార్టీలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. తాజాగా జరిపిన మంత్రివర్గ పునర్ వ్య‌వ‌స్థీకరణ తర్వాత సీఎంఓలోని ఒక ఉన్నతాధికారి వివిధ శాఖల్లో మంత్రుల అభీష్టంతో నిమిత్తం లేకుండా ఓఎస్‌డి, పిఎస్‌లను నియమించిన తీరుపైనా కొత్త మంత్రుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు మరో రెండేళ్లే ఉన్నాయని, ఇప్పటివరకూ కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయామని మంత్రులు, ఎమ్మెల్యేలు వాపోతున్నారు. రేపు ఎన్నికల్లో వారితో ఏ ముఖం పెట్టుకుని పనిచేయించుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఐఎఏఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు ఆలస్యమవుతున్నాయని వివరిస్తున్నారు. తాజాగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చంద్ర బృందం ఉన్నతాధికారుల బదిలీలపై కసరత్తు చేస్తున్న‌ద‌ని చెబుతున్నారు. మొత్తంగా అధికారుల బ‌దిలీ విష‌యంలో టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేల ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నిర్ణ‌యం ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/