Begin typing your search above and press return to search.

హోదా ముగిసింది..రైల్వేజోన్‌ మాయ మిగిలింది!

By:  Tupaki Desk   |   15 Sept 2016 9:44 AM IST
హోదా ముగిసింది..రైల్వేజోన్‌ మాయ మిగిలింది!
X
చంద్రబాబునాయుడు.. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో తొలినుంచి చాలా మాయ చేస్తూనే వచ్చారనేది జనంలో ఉన్న అనుమానం. 'హోదా వస్తుంది' అనే మాట తన నోటితో స్పష్టంగా పలకకుండా రకరకాలుగా డొంకతిరుగుడుగా చెబుతూ వచ్చి, చివరకు హోదా లేకుండా ప్యాకేజీ మాత్రమే తీసుకునే పరిస్థితిని కల్పించారని ప్రజలు అనుకుంటున్నారు. హోదా ఇవ్వలేదు ఏం చేద్దాం.. ఇచ్చింది తీసుకుందాం.. అనే పరిస్థితికి చంద్రబాబు జనాల్ని ట్యూన్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని జనం అనుకుంటున్నారు. ఆ రకంగా హోదా కోసం జనంలో ఉన్న కోరికను ఆయన సమాధి చేసేసారనేది పలువురి అభిప్రాయం.

ఇక ఇప్పుడు విశాఖ పట్టణం రైల్వేజోన్‌ వంతు వచ్చింది. కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ కాకుండా, విజయవాడ కేంద్రంగా ఇస్తాం అంటూ ప్రకటించినట్లుగా ప్యాకేజీ గురించి చర్చ నడిచిన రోజున పుకార్లు వచ్చాయి. విశాఖ పట్టణాన్ని తమ జోన్‌ లోంచి వదులుకోవడానికి ఒరిస్సా రాష్ట్రం ఒప్పుకోవడం లేదు గనుక.. జోన్‌ కు కేంద్రంగా విశాఖను ఇవ్వడం లేదు అనేది కేంద్రం వాదన. అసలు మన రాష్ట్రంలోని విశాఖను వదులుకోవడం, వదులుకోకపోవడం అనేది ఒరిస్సా వారి ఇష్టాయిష్టాల మీద ఎలా, ఎందుకు ఆధారపడి ఉంటుందో రాష్ట్రంలో సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా వ్యవహరించి... ఎందుకు తక్షణం కేంద్రంనుంచి జోన్‌ ను సాధించలేకపోతున్నదో వారికి తెలియడం లేదు.

అయితే.. చంద్రబాబునాయుడు మాత్రం.. కేంద్రాన్ని ప్రశ్నించే స్థితిలోగానీ, గట్టిగా డిమాండ్‌ చేసే స్థితిలో గానీ లేరని జనం నమ్ముతున్నారు. ఆయన కేసుల ఊబిలో ఉన్నందువల్ల.. కేంద్రం ను గట్టిగా ఏదీ అడగలేని విధంగా ఉన్నారని వారి భావన. అందుకే జోన్‌ విషయంలోనూ పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. ఆయన మాత్రం విశాఖలో జరిగే కార్యక్రమాల్లో.. రైల్వేజోన్‌ మన హక్కు - విశాఖ కేంద్రంగానే రైల్వేజోన్‌ వస్తుంది.. అని మాయ మాటలు చెబుతున్నారని.. చివరికి కేంద్రం విజయవాడ జోన్‌ ప్రకటించిన రోజున.. ''మనం విశాఖ కావాలనే అడిగాం.. వాళ్లు ఇవ్వలేదు. మనం ఏం చేయగలం'' అంటూ భరతవాక్యం పలికేస్తారని జనం అనుకుంటున్నారు. మరి విశాఖ జోన్‌ విషయంలో చంద్రబాబునాయుడు జనాలకు ఎలా నమ్మకం కలిగిస్తారో వేచిచూడాలి.