Begin typing your search above and press return to search.

మోదీ, కేసీఆర్ నన్ను తిడుతున్నారు.. భయపడుతున్న చంద్రన్న

By:  Tupaki Desk   |   9 Feb 2019 1:31 PM GMT
మోదీ, కేసీఆర్ నన్ను తిడుతున్నారు.. భయపడుతున్న చంద్రన్న
X
ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన కోర్కెలు నెరవేర్చాకే ఈ గడ్డపై ప్రధాని మోదీ అడుగుపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తమ న్యాయమైన కోర్కెలు నెరవేర్చకుండా ఈ గడ్డపై తమను తిట్టేందుకు ఇక్కడికొస్తే ఊరుకునేది లేదని... మోదీకి ఈ సంగతి అర్థమయ్యేలా ప్రజలు నిరసనలతో హోరెత్తించాలని పిలుపునిచ్చారు. నెల్లూరులో నిర్వహించిన సభలో మాట్టాడిన చంద్రబాబు... ‘మోదీ రేపు గుంటూరొస్తున్నాడు.. మళ్లీ నన్ను తిడతాడు. నేను వైసీపీ ట్రాప్ లో పడిపోయానని మోదీ అంటున్నాడు... నేనెవరి ట్రాప్‌ లోనూ పడలేదు. మీరే వైసీపీ అవినీతి ట్రాప్లో పడ్డారు. కేసీఆర్ కు నాకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉందని అంటున్నారు. ఆయన నా దగ్గర ఉండి పైకొచ్చినోడే. ఇప్పుడేదో అదృష్టం బాగుండి ఇలా అయ్యాడు. నన్ను ఎన్ని విమర్శించలో అన్ని విమర్శిస్తున్నాడు’’ అన్నారు.

తాను దిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షను నిర్వీర్యం చేయ‌డానికే ప్రధాని మోదీ ఏపీ వస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రగతి కోసం, భావి త‌రాల భ‌విష్య‌త్తు కోసం తాను ఈ పోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ చేస్తున్న ఈ పోరాటానికి అందరి సంఘీభావం ఉందన్నారు. దిల్లీలో దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో కూడా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల మద్దతు తీసుకుని ప్రతి ఒక్కరూ నిరసనల్లో పాల్గొనాలని సూచించారు. ప్రధాని మోదీ గుంటూరు పర్యటన సందర్భంగా నిరసన దినంగా పాటించాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

‘‘ఆదివారం ఒక దుర్దినం. పుండు మీద కారం చల్లడానికే మోదీ వస్తున్నారు. చేసిన దుర్మార్గం చూసేందుకు ఆయన వస్తున్నాడు’’ అంటూ.. ప్రభుత్వాలను మోదీ అస్ధిర పరుస్తున్నారని, నాయకత్వాలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాఫెల్ బురదలో మోడీ కూరుకు పోయారని, ఈ వ్యవహారంలో పీఎంఓ జోక్యం చేసుకుని దేశానికి అప్రదిష్ట తెచ్చారని చెప్పారు. మోడీ అడుగులు ఆంధ్రప్రదేశ్ ను అపవిత్రం చేస్తాయన్నారు. టీడీపీ శ్రేణులంతా పసుపు చొక్కాలు, నల్ల చొక్కాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.