Begin typing your search above and press return to search.

రగిలిపోయే కౌగిలి అది...?

By:  Tupaki Desk   |   17 Dec 2021 3:30 PM GMT
రగిలిపోయే కౌగిలి  అది...?
X
అవును. ఆ కౌగిలి వెనక బంధం వేరు. దాని వెనక ప్రేమ వేరు. మమకారంతో పాటు సహకారం కలగలసిన కౌగిలి అది. వేలాది మంది జనం సాక్షిగా ఆ కౌగిలి ఎవరినో రగిలించేలా ఉంది. ఆ ఎవరు అన్నది అందరికీ తెలిసిందే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ క్రిష్ణంరాజు చంద్రబాబు కౌగిలిలో బంధీ అయ్యారు. అంతే కాదు బాబు పక్కనే కూర్చుని జగన్ మీద ఒక్క లెక్కన చెలరేగిపోయారు.

ఇది కావాలని చేశారా అంటే రాజకీయాల్లో ఎపుడూ అలాగే చేస్తారు. ప్రత్యర్ధిని కవ్వించడానికి చేసే అనేక చర్యల్లో ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంతకీ ఈ కౌగిలి అది పెట్టిన గిలి సంగతేంటి అంటే అమరావతి రాజధాని కోసం రైతులు తిరుపతిలో జరిపిన సభలో ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు పాల్గొన్నారు. ఆ విధంగా ఆయన వైసీపీ లేని లోటు ఆ సభకు తీర్చేశారు.

అయితే ఆ సభకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురేగి మరీ రాజు గారు ఆలింగనం చేసుకుంటే బాబు సైతం ఆయన్ని మరింత గట్టిగా దగ్గరకు తీసుకుని ఆత్మీయత చూపారు. పలికేది రాఘురాముడు, పలికిందేది చంద్రబాబు అని ఇప్పటిదాకా వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది.

దానిని నిజం చేయాలనుకున్నారో, లేక ఇదే రుజువు అని చెప్పాలనుకున్నారో తెలియదు కానీ ఈ ఇద్దరు కౌగిలి మాత్రం వైసీపీ నేతలకు మండిపోయేదిగానే ఉంది మరి.   అంతే కాదు, తమ పార్టీ గుర్తు  మీద గెలిచి తమ‌నే తెగనాడుతూ ప్రత్యర్ధి చంద్రబాబు సరసన కూర్చుని తాము కోరి మరీ తెచ్చిపెట్టిన మూడు రాజధానుల పాలసీని రాజు వ్యతిరేకిస్తూంటే వైసీపీ వారికి మంట ఉండదు అంటే నమ్మేవారుంటారా.

మొత్తానికి అమరావతి రైతుల సభ సాక్షిగా రఘురామ రాజు మరో అడుగు ముందుకేసారు. నేను మీ పార్టీనే. కానీ నా పాలిటిక్స్  వేరు అంటూ చెప్పకనే చెప్పాడనుకోవాలి. ఇపుడు ఆయన మీద చర్యలు తీసుకుంటారా లేక అలాగే వదిలేస్తారా అన్నది చూడాలి. ఏం చేసినా ఈ పరిస్థితుల్లో వైసీపీకేమీ లాభం లేకపోగా నష్టమే అంటున్నారు. ఇక రాజు జగన్ని ఢీ కొట్టి చాలా దూరమే వెళ్ళారు. ఆయన రూటే సెపరేట్ అని కూడా చెప్పేశారు. సో ఆయన మీద యాక్షన్ తీసుకుంటే ఇంకా మంచిదన్న వైఖరితోనే ఉన్నారు. మొత్తానికి ఒక్క కౌగిలితో టోటల్ గా రగిలించేశారు రాజుగారు.