Begin typing your search above and press return to search.

మోడీతో బాబు-భేటీ ముగిసింది

By:  Tupaki Desk   |   25 Aug 2015 12:42 PM IST
మోడీతో బాబు-భేటీ ముగిసింది
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు-ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ స‌మావేశం ముగిసింది. ఈ భేటీలో చంద్ర‌బాబుకు మోడీ నుంచి ప్ర‌త్యేక హోదాపై హామీతో పాటు భారీ ప్యాకేజీ పై క్లారిటీ వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నా అవి అంతగా నెరవేరే అవకాశం లేదని తెలుస్తోంది. ఉద‌యం 10.30 నిమిషాల‌కు ప్రారంభ‌మైన వీరి భేటీ సుమారు గంట‌న్న‌ర పాటు కొన‌సాగింది. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ భేటీలో కూడా మోడీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏ మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేద‌ని స‌మాచారం.

ఏపీ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధికి తీసుకోవాలసిన అవసరాలతో కూడిన 200 పేజీల నివేదిక‌ను చంద్ర‌బాబు ప్ర‌ధాన‌మంత్రి మోడీకి స‌మ‌ర్పించ‌డంతో పాటు ఏపీలో ఉన్న స్థితిగతుల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ స‌మావేశం ముగిసిన వెంట‌నే ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న హామీల‌న్నింటిని నెర‌వేరుస్తామ‌ని మోడీ చెప్పిన‌ట్టు సింపుల్‌ గా చెప్పారు. ప్ర‌త్యేక హోదాతో గురించి గాని, ప్యాకేజీ గురించి గాని భరోసా ఇచ్చే మాటలు చెప్పలేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీ గురించి రోడ్ మ్యాప్ రూపొందించాల‌ని నీతి అయోగ్‌ ను ఆదేశించిన‌ట్టు మాత్రం వెల్లడించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని 46 - 90 - 94 సెక్ష‌న్ల గురించి కూడా చ‌ర్చించిన‌ట్టు ఆయ‌న చెప్పారు.

ఈ బేటిలో చంద్రబాబు నెరవేర్చాల్సిన విభజన హామీలను, నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రానికి, ఇరు పార్టీలకు జరిగే నష్టాన్ని.. ప్రజల ఆకాంక్షలను మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీ ఆర్థికంగా నిలదోక్కుకునేంత వరకూ సాయం చేయాలని ప్రధానిని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అంత‌కు ముందు ఆయ‌న కేంద్ర మంత్రులు వెంక‌య్య‌నాయుడు, రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో కూడా స‌మావేశ‌మై ఏపీకి విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని కోరారు.

మొత్తానికి ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మ‌రికొంత కాలం వేచి చూడాల్సిందేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ రోజు సాయంత్రం చంద్ర‌బాబు ఢిల్లీలో మీడియా స‌మావేశంలో మాట్లాడ‌నున్నారు. ఆయ‌న మాట్లాడిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది. ఆయ‌న మోడీపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చార‌నేది కూడా స్ప‌ష్టంగా తెలియాల్సి ఉంది.