Begin typing your search above and press return to search.

మోడీ ముంద‌స్తుకు ఇద్ద‌రు చంద్రుళ్లు నో!

By:  Tupaki Desk   |   18 May 2018 5:41 AM GMT
మోడీ ముంద‌స్తుకు ఇద్ద‌రు చంద్రుళ్లు నో!
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో అంచ‌నాల‌కు మించిన సీట్ల‌ను సాధించి.. అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది బీజేపీ. ఇప్పుడా పార్టీ ఎదుట పెద్ద స‌వాలే ఎదురుంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని.. స‌ర్వ శ‌క్తుల్ని ఒడ్డి మ‌రీ.. గెలుపు కోసం ప‌డిన అవ‌స్థ‌లు అన్ని ఇన్ని కావు. రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు క‌మ‌ల‌నాథుల‌కు క‌ల‌వ‌రపాటుకు గురి చేస్తున్నాయి.

ఎందుకంటే.. రానున్న రోజుల్లో ఎన్నిక‌లు జ‌రిగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్తాన్.. చ‌త్తీస్ గ‌ఢ్ ల‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త భారీగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగితే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌. అన్నింటికి మించి.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చే ఈ ఫ‌లితాలు.. సార్వ‌త్రికం మీద ప‌డితే మోడీ ప‌రివారానికి దెబ్బ‌గా మారుతోంది. ఈ నేప‌థ్యంలో కొద్ది నెల‌ల్లో జ‌ర‌గాల్సిన నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు.. కేంద్రం కూడా ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

అదే జ‌రిగితే.. ప్ర‌భుత్వం మీద ఉన్న వ్య‌తిరేక‌త డైవ‌ర్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. అందుకే.. వ‌చ్చే ఏడాది మార్చి.. ఏప్రిల్ లో జ‌ర‌గాల్సిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని కాస్త ముందుకు జ‌రిపి.. ముంద‌స్తు లోకి వెళ్లి పోవాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ అండ్ కో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని ముంద‌స్తుగా నిర్వ‌హించాల‌ని బీజేపీ భావిస్తున్న వేళ‌.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల గ‌డువు వ‌చ్చే ఏడాది మే వ‌ర‌కు ఉంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని ముందుగా నిర్వ‌హిస్తే.. ఇద్ద‌రుచంద్రుళ్లు త‌మ రాష్ట్రాల ఎన్నిక‌ల్ని ముందుకు నెడ‌తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ముంద‌స్తు ఆలోచ‌న‌లో ఇద్ద‌రు చంద్రుళ్లు లేర‌ని చెబుతున్నారు. త‌మ ప్ర‌భుత్వాల‌కు ఎప్ప‌టివ‌ర‌కూ గ‌డువు ఉందో అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వాన్ని ర‌న్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌వేళ ఇప్ప‌టికే వినిపిస్తున్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు మోడీ ముంద‌స్తుకు వెళితే వ‌దిలేయాలే కానీ.. తాము మోడీ బాట ప‌ట్ట‌కూడ‌ద‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఒక‌వేళ‌.. ముంద‌స్తుకు వెళ్లినా.. ఆ ఫ‌లితాలు త‌మ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న విశ్వాసాన్ని ఎంతోకొంత చెబుతాయ‌ని.. వాటిల్లో లోటుపాట్ల‌ను తెలుసుకొని.. వాటిని స‌రిదిద్దుకోని.. షెడ్యూల్ ప్ర‌కార‌మే త‌మ రాష్ట్ర ఎన్నిక‌లకు వెళ్లే వీలుంద‌ని చెబుతున్నారు. ముంద‌స్తు.. ముంద‌స్తు అంటూ చంద్ర‌బాబు ఒక‌ప్పుడు ఎంత న‌ష్ట‌పోయారో తెలిసిందే. చూస్తూ. చూస్తూ.. అలాంటి త‌ప్పును చంద్ర‌బాబు పున‌రావృతం చేయ‌రు క‌దా?