Begin typing your search above and press return to search.

అమరావతిలో బాబుకు ఇంతకంటే అవమానం లేదు.!

By:  Tupaki Desk   |   28 Nov 2019 4:40 AM GMT
అమరావతిలో బాబుకు ఇంతకంటే అవమానం లేదు.!
X
2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఏపీ కలల రాజధాని అమరావతి అంటూ ఊరువాడ ప్రపంచమంతా చాటింపు వేయించారు. కట్టేస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ ఐదేళ్లు గడిచేసరికి అమరావతి మొండి గోడలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. మూడు పంటలు పండే విలువైన భూములను రైతుల నుంచి కాజేసి రాజధాని నిర్మించకుండా రియల్ భూమ్ సృష్టించి తన అనుయాయులకు మేలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కార్పొరేట్ మాయలా మారిన అమరావతి గుట్టును వైసీపీ ప్రభుత్వం ఇటీవలే రట్టు చేసింది. రైతుల భూములను టీడీపీ నేతలు, బినామీలు కొల్లగొట్టారని తేల్చింది.

అమరావతి నిర్మాణ ప్రధాతగా చెప్పుకున్న చంద్రబాబు గత ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రతిపక్ష నేతగా మారిపోయారు. ఇప్పుడు తను కట్టని మొండిగోడల అమరావతి రాజధాని పర్యటనకు వెళుతున్నారు. అయితే చంద్రబాబు రాజధాని పర్యటన ముందే ఆయనకు రాజధానిలో ఘోర అవమానం ఎదురవుతోంది.

చంద్రబాబు రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, రైతులు కూలీల పేరుతో నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. 'చంద్రబాబు మరోసారి మా జీవితాలో ఆడుకోవద్దు'అంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలతో బాబు ఫొటో పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో చంద్రబాబుకు రాజధాని రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని పేరుతో రైతులను మోసం చేసి ఏ ముఖం పెట్టుకొని రాజధానిలో పర్యటిస్తున్నారంటూ ఫ్లెక్సీలో ప్రశ్నించారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్ తో రంగుల కల చూపించి మమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగుపెట్టాలని ధ్వజమెత్తారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం సందర్భంగా హామీనిచ్చిన రాజధాని బాధిత వాసులకు ఉచిత విద్య, ఉచితవైద్యం, యువతకు ఉపాధి, కూలీలకు ఉపాధి ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించేలా ఫ్లెక్సీలను రాజధాని రైతులు ఏర్పాటు చేయడం విశేషం.

తూళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 28,054 మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలను అప్పటి ప్రభుత్వం భూసేకరణ ద్వారా సేకరించింది. ఆ రైతులకు చిప్ప చేతికి ఇచ్చాడని ఆరోపిస్తూ ఆ ప్రాంత రైతులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చంద్రబాబుకు ఘోర అవమానం మారాయి.