Begin typing your search above and press return to search.

దేశంలో మహమ్మారి విధ్వంసం ఖాయమా?

By:  Tupaki Desk   |   31 May 2020 7:11 AM GMT
దేశంలో మహమ్మారి విధ్వంసం ఖాయమా?
X
రెండు నెలలపాటు అందరినీ ఇంట్లోనే ఉంచి లాక్ డౌన్ విధిస్తేనే కట్టడి కానీ ఆ మహమ్మారి ఇప్పుడు సడలింపులు ఇచ్చి.. రైళ్లు, బస్సులు నడుస్తున్న వేళ ఎలా ఆగుతుంది. అందుకే పంజా విసురుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు వేల కేసులు.. వందల మరణాలు దేశంలో పెరిగిపోయాయి. దీనంతటికీ మోడీ ఇచ్చిన సడలింపులు కారణం కాగా.. జనాలు కూడా లైట్ తీసుకోవడంతో దేశానికి పెను ప్రమాదం వాటిల్లుతోంది.

భారత దేశంలో ఇప్పటిదాకా ఏ రోజు 8వేల కేసులు నమోదు కాలేదు. కానీ శనివారం ఏకంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కరోజే 8వేలకు పైగా నమోదయ్యాయి. ఒక్కరోజే 150 మందికి పైగా మరణించారు.

దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో ఏకంగా 3600కు పైగా కేసులు బయటపడడం భయానకం సృష్టిస్తోంది. తెలంగాణలో ఎప్పుడూ దాటని విధంగా కేసుల సంఖ్య ఏకంగా 169 బయటపడడం షాకింగ్ గా మారింది. మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా కేసుల సంఖ్య 1.73 లక్షలకు చేరింది. 90వేలమందికి పైగా కోలుకున్నారు.

ఇలా కేసుల సంఖ్య వేలకు చేరడం.. రోజురోజుకు పెరుగుతుండడం.. మరణాలు చోటుచేసుకుంటుండడంతో మోడీ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు దేశంలో మహమ్మారి ప్రబలడానికి అవకాశం కల్పిస్తోంది. ఇదే జరిగితే పెను విధ్వంసం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాలు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. కానీ రెండు నెలలుగా ఆదాయం లేక అరిగోస పడుతున్న జనాలను సడలింపులు అన్నీ ఇచ్చేశాక మళ్లీ ఆపడం ఎవరితరం కాదన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ మహమ్మారి వ్యాప్తిని ఎలా అరికట్టాలో తెలియని పరిస్థితి ప్రభుత్వాలకు నెలకొంది.