Begin typing your search above and press return to search.

అమ్మవారి కంట కన్నీరు.. తరలివస్తున్న భక్తజనం

By:  Tupaki Desk   |   30 Sept 2019 10:45 AM IST
అమ్మవారి కంట కన్నీరు.. తరలివస్తున్న భక్తజనం
X
కొన్ని ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. అలాంటి ఉదంతంగా తాజా అంశాన్ని చెప్పాలి. ఒక అమ్మవారి విగ్రహం కంటి నుంచి కన్నీరు కారుతున్న వైనం సంచలనంగానే కాదు.. భక్తజనాన్ని పరుగులు తీస్తూ.. ఆలయానికి వచ్చేలా చేస్తోంది. ఈ విచిత్ర ఉదంతం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

బిహార్.. ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్.. హర్యానా.. రాజస్థాన్ లలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షం కారణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి ఆయా రాష్ట్రాల్లో. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ లోని నీమచ్ పరిధిలోని థాన్మండీ గ్రామంలోని చాముండీ అమ్మవారి ఆలయంలో చోటుచేసుకున్న వింత ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

అమ్మవారి విగ్రహం కంటి నుంచి కన్నీరు వస్తుందన్న వార్త అక్కడి ప్రజల్ని ఆలయానికి పరుగులు తీసేలా చేస్తోంది. అమ్మవారిని సందర్శించుకున్నవారంతా అదంతా అమ్మవారి మహత్యంగా కీర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సంభవించిన వరదల విపత్తుతో అమ్మవారు ఆక్రోశిస్తున్నట్లుగా కొందరు చెబుతున్నారు.

అదేమీ కాదని.. రానున్న రోజుల్లో మరింత ఉపద్రవం ఏందో విరుచుకుపడనుందని.. ఆ చెడు పరిణామానికి ముందస్తు హెచ్చరికగా అమ్మవారి కంటి నుంచి కన్నీరు వస్తుందని చెబుతున్నారు. ఈ ఉదంతంతో అమ్మవారి ఆలయానికి భక్త జనం పోటెత్తుతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున భజనలు చేస్తున్నారు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్ లో ఇప్పుడో చర్చనీయాంశంగా మారింది.