Begin typing your search above and press return to search.

ఇలాంటి వాళ్లు మేధావులు కావడం మన ఖర్మ!

By:  Tupaki Desk   |   3 Sept 2016 7:39 PM IST
ఇలాంటి వాళ్లు మేధావులు కావడం మన ఖర్మ!
X
పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకహోదా గురించి స్పందించిన నాలుగు రోజుల తర్వాత.. ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు కూడా స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ స్పందించినందుకు ఆయన తన సంతోషాన్ని తెలియజేశారు. పవన్‌ పిలుపు ఇచ్చిన మేరకు ధర్నాలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం అంటూ చలసాని శ్రీనివాస్‌ చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఆయన ఏపీకి ప్రత్యేకహోదా సాధన సమితికి అద్యక్షుడు కూడా కావడం ఈ సందర్భంగా గమనార్హం.

తమ సాధన సమితి తరఫున అన్ని జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తామని, అన్ని జిల్లాల్లో హోదా ప్రాముఖ్యతను తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహిస్తాం అని చలసాని శ్రీనివాస్‌ చెబుతున్నారు. అన్ని జిల్లాల్లో దర్నాలు కూడ చేస్తారుట. ఇటీవల చేసిన రక్తదానం లాగానే.. రాష్ట్ర వ్యాప్తంగా రక్తం సేకరిస్తారట.

అయితే చలసాని శ్రీనివాస్‌ ఇన్నాళ్లూ టీవీల్లో మాట్లాడడం మినహా ఇంకేం చేస్తున్నట్లు అని జనం అనుకుంటున్నారు. ఎందుకంటే.. హోదా గురించి రెండున్నరేళ్ల తర్వాత.. జిల్లాల్లో జనానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం అంటున్నారంటే.. ఇన్నాళ్లూ వీరేం చేసినట్లు అని జనం ప్రశ్నిస్తున్నారు. ఈ రెండున్నరేళ్ల మౌనానికి పవన్‌ కల్యాణ్‌ కూడా చాలా తిట్లు భరించారు. వివరణలు ఇచ్చుకున్నారు. అయితే చలసాని శ్రీనివాస్‌ ఏమీ చేయకుండా ఉండిపోవడం కరెక్టు కాదు కదా అనేది జనాభిప్రాయం.

జనంలో వినిపిస్తున్న మరో మాట ఏంటంటే.. పవన్‌ కల్యాణ్‌ పోరాటాన్ని స్వాగతిస్తున్నాం అన్నటువంటి చలసాని శ్రీనివాస్‌.. అదే మద్దతును వైఎస్‌ జగన్‌ పోరాటం సమయంలో ప్రకటించలేకపోయారే అని అంటున్నారు. రాజకీయంగా కొన్ని శక్తులు చేతిలో కీలుబొమ్మల్లా పనిచేసే ఇలాంటి వారి వల్ల ప్రయోజనం ఉండదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.