Begin typing your search above and press return to search.

ఏపీకి రైల్వే జోన్‌!..విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే!

By:  Tupaki Desk   |   27 Feb 2019 2:33 PM GMT
ఏపీకి రైల్వే జోన్‌!..విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే!
X
ఏపీకి కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు తీపి కబురు వినిపించింది. విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు కాసేప‌టి క్రితం కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ విశాఖ కేంద్రంగా కొత్త‌గా రైల్వే జోన్‌ ను ప్రారంభించ‌నున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వాల్తేరు డివిజ‌న్‌ లోని ఏపీ స్టేష‌న్లతో పాటు విజ‌య‌వాడ‌ - గుంటూరు - గుంత‌క‌ల్ డివిజ‌న్ల‌తో ఈ జోన్‌ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన గోయ‌ల్‌... ఈ జోన్‌ కు సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఐదేళ్లుగా ఏపీకి ప్ర‌త్యేక హోదా - విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్ర‌క‌టించాల్సిందేనంటూ ఏపీ ప్ర‌జ‌లు నిన‌దిస్తున్నా ప‌ట్టించుకోని మోదీ స‌ర్కారు... స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు విశాఖ రైల్వే జోన్‌ ను ప్ర‌క‌టించ‌డంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.

అంతేకాకుండా మ‌రో రెండు రోజుల్లో ఏపీ ప‌ర్య‌ట‌న‌కు మోదీ రానున్న నేప‌థ్యంలో విశాఖ రైల్వే జోన్ ప్ర‌క‌ట‌న రావ‌డం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీ ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌న్న భావ‌న‌తోనే మోదీ స‌ర్కారు.. విశాఖ రైల్వే జోన్‌ ను ప్ర‌క‌టించింద‌న్న వాద‌నా వినిపిస్తోంది. రాజ‌కీయంగానూ వ్యూహాత్మ‌కంగా క‌దిలిన నేప‌థ్యంలోనే బీజేపీ స‌ర్కారు విశాఖ రైల్వే జోన్‌ ను ప్ర‌క‌టించింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఏదైతేనేం... ఏపీ ప్ర‌జ‌లు కోరుకున్న‌ట్లుగా విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్‌ ను ప్రక‌టించిన మోదీ స‌ర్కారు ఏపీకి తీపి క‌బురు వినిపించింది.