Begin typing your search above and press return to search.

సరిహద్దుల పటిష్టతకు కేంద్రం కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   25 Sept 2020 3:20 PM IST
సరిహద్దుల పటిష్టతకు కేంద్రం కీలక నిర్ణయం
X
సరిహద్దుల్లో ప్రతిరోజు జరుగుతున్న వివాదాల నేపధ్యంలో బలగాలను పటిష్టం చేయటానికి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ అవసరాల్లో ఉపయోగిస్తున్న కేంద్ర బలగాలన్నింటినీ వెంటనే ఉపసంహరించేయాలని కేంద్ర రక్షణ, హోంశాఖలు సంయుక్తంగా నిర్ణయించాయి. దేశంలో ఎక్కడ ఏ అవసరమొచ్చినా వెంటనే కేంద్రబలగాలైన ప్యారా మిలిటరీ, ఎస్ఎఫ్ఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి దశాలను తరలిస్తున్నారు. ఇక నుండి ఇటువంటి దశాల సేవలను దేశంలో ఎక్కడ కూడా ఉపయోగించుకోకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నాయి.

ఒకవైపు చైనా మరోవైపు పాకిస్ధాన్ సరిహద్దుల్లో మన సైన్యాలకు వివాదాలు ఎదురవుతున్నాయి. లడ్డాఖ్ లోయలోని గాల్వాన్ ప్రాంతం, ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంతో పాటు ఫింగర్స్ పర్వతాల్లాటి అనేక ప్రాంతాల్లో ప్రతిరోజు మన సైన్యాలను దొంగ దెబ్బ దీయాలనే ప్రయత్నిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. గాల్వాన్ లోయలో డ్రాగన్ సైన్యాలు దాడుల కారణంగా 20 మంది భారత్ సైనికులు మరణించిన విషయం తెలిసిందే. మన సైనికులు 20 మంది మరణించినా చైనా సైనికులు కూడా ఈ గొడవల్లో 40 మంది చనిపోయారు.

ఈ ఘటనల తర్వాత వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో నిఘా, గస్తీని ఇప్పటికైనా మరింత పటిష్టం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే దేశంలో అంతర్గతంగా అనేక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేంద్ర బలగాలను వెంటనే ఉపసంహరించి సరిహద్దుల్లోకి పంపేయాలని డిసైడ్ అయ్యాయి. ప్రస్తుతం కేంద్ర బలగాలు అనేకమంది ముఖ్యమంత్రులు, మంత్రుల వ్యక్తిగత సెక్యురిటి కోసమే కాకుండా కార్యాలయాలకు కూడా భద్రతగా ఉంటున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల భద్రతా వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నాయి.

కేంద్రం అంచనా ప్రకారం అన్నీ రాష్ట్రాల్లో కలిపి సుమారు లక్ష వరకు కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా శాంతిభద్రతల పరిరక్షణకు కూడా పై బలగాలను వాడేస్తున్నాయి. కాబట్టి ఇకనుండి సిఆర్పీఎఫ్ బలగాలతో స్ధానిక పోలీసులను కలిపి విధులు నిర్వర్తించేట్లుగా చూడాలని కేంద్రం తాజాగా డిసైడ్ అయ్యాయి. రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వాళ్ళందరినీ వెంటనే సరిహద్దులకు పంపాలన్నది కేంద్రం నిర్ణయం. మరి ఎంత తొందరగా ఈ నిర్ణయం అమలవుతుందో చూడాల్సిందే.