Begin typing your search above and press return to search.

ఏపీ సర్కారుకు షాక్..రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్

By:  Tupaki Desk   |   18 Dec 2020 11:00 AM IST
ఏపీ సర్కారుకు షాక్..రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్
X
తెలంగాణ ప్రభుత్వం తరచూ వేలెత్తి చూపించే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీ సర్కారుకు ఇబ్బందిగా మారనుంది. ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా తయారు చేసిన రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్ ను కేంద్రం తప్పుపట్టింది. అందులో కనీస ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అభిప్రాయ పడింది.

మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ను నవంబరు 16న ఈ విధానంలో వాటి కాపీలను కేంద్రానికి పంపింది ఏపీ సర్కారు. అయితే..తాజాగా ఆ డీపీఆర్ పై కేంద్ర జలశక్తిశాఖ స్పందించింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా డీపీఆర్ ను రూపొందించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన లేఖ ఒకటి ఏపీ సర్కారుకు రాశారు. ఈ పరిణామంతో ఏపీ సర్కారుకు కొత్త చిక్కు ఎదురైనట్లే. ఎందుకంటే.. ఇప్పటికే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పు పడుతోంది. తమ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సమర్పించిన డీపీఆర్ 46 పేజీలు ఉండగా.. అందులో కనీస.. ప్రాథమిక అంశాలైన హైడ్రాలజీ.. అంతర్రాష్ట్ర అంశాలు.. ఇరిగేషన్ ప్లానింగ్.. డిజైన్.. ఖర్చుకు సంబంధించిన అంశాలు ఏమీ లేవని పేర్కొంది. నీటిపారుదల.. బహుళార్థక ప్రాజెక్టుల డీపీఆర్ ల తయారీ మార్గదర్శకాలు కేంద్ర జలసంఘం వెబ్ సైట్ లో ఉన్నాయని.. వాటికి అనుగుణంగా డీపీఆర్ లు సిద్ధం చేయాలని కోరారు. ఈ పరిణామం ఏపీకి కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పక తప్పదు.