Begin typing your search above and press return to search.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ : తగ్గేదేలే..హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ !

By:  Tupaki Desk   |   28 July 2021 1:30 PM GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ : తగ్గేదేలే..హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ !
X
విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉండదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగిస్తామని కేంద్రం అఫిడవిట్‌ లో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. వంద శాతం స్టీల్‌ ప్లాంట్‌ పెట్టుబడులను ఉపసంహరించుకోబోతున్నట్లు తెలిపిన కేంద్రం. ఇప్పటికే బిడ్డింగులను ఆహ్వానించినట్టు అఫిడవిట్‌ లో ఏపీ హైకోర్టుకు వెల్లడించింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్‌ అఫిడవిట్‌ కేంద్రం దాఖలు చేసింది.

కేంద్రం తరపున కార్యదర్శి ఆర్కే సింగ్ ఈ మేరకు దాఖలు చేశారు. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే.. స్టీల్ ప్లాంట్‌ లో పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతున్నట్లు అఫిడవిట్‌ లో పేర్కొంది కేంద్రం. దీనిపై ఈ ఏడాది జనవరి 27నే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం హైకోర్టుకు చెప్పింది. హైకోర్టు లో వేసిన పిటీషన్ రాజకీయ దురుద్దేశంతో వేశారంటూ కేంద్రం అభిప్రాయపడింది.

ఉద్యోగులు ప్లాంటు అమ్మవద్దనడం సరికాదు, 100 శాతం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాలు జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ విషయంలో జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటీషన్ విచారణకు అర్హత లేనిదని అభిప్రాయపడింది కేంద్రం.

దేశ ఆర్థిక వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇటువంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆర్కే సింగ్ అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఇటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉందని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని అఫిడవిట్‌లో కోరింది కేంద్రం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. టీడీపీ కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటికరణను వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటికరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఇలాంటి వాటిపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ఉదహరించారు. కేంద్ర క్యాబినెట్ కమిటీలో ప్రధాని, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, ఉక్కు మంత్రి, పెట్రోలియం మంత్రి సభ్యులుగా ఉన్నారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అర్హత కలిగిన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్ లను కొట్టివేయాలని కేంద్రం తన కౌంటర్ దాఖలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తేల్చిచెప్పింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కినా సరే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోబోదని తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా మరోసారి స్పష్టం చేసింది