Begin typing your search above and press return to search.

హరి హరీ.. రైల్వేజోన్ కు మంగళం

By:  Tupaki Desk   |   12 March 2018 4:01 PM GMT
హరి హరీ.. రైల్వేజోన్ కు మంగళం
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ దాక్కుని ఉన్నారో వెతకాలి ఇప్పుడు? రాష్ట్రానికి విశాఖ రైల్వేజోన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సాధిస్తాం , కేంద్రం దీనిపై కసరత్తు చేస్తోంది.. మరి కొన్ని రోజుల్లోనే అనుకూల ప్రకటన వస్తుంది.. అంటూ.. ఇన్నాళ్లుగా ప్రకటించిన, పదేపడే టముకు వేసుకున్న భాజపా నాయకుల మొహాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్క ఉంటుందో లేదో వెతకాలి ఇప్పుడు? ఎందుకంటే.. విశాఖ రైల్వే జోన్ అనేది ఏమాత్రం సాధ్యం కాదని కేంద్ర హోం శాఖఱ తేల్చిచెప్పేసింది. ఈ మేరకు కేంద్ర అధికారులు, ఏపీ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ కు స్పష్టంచేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం.. విశాఖ రైల్వేజోన్ హక్కుగా దక్కవలసిన అవసరం ఉంది. అది ఆ చట్టంలో ఉన్న హామీ. అయితే జోన్ కోసం ఎన్ని వినతులు చేస్తున్నా.. కేంద్రం సీరియస్ గా పట్టించుకోకుండా.. మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈ బడ్జెట్ లో కూడా మొండిచేయి చూపించిన తర్వాత.. రాష్ట్రంలో ఆందోళనలు హెచ్చవడంతో.. కేంద్రంలో కాస్త కదలిక వచ్చిందని అంతా అనుకున్నారు. హోదా సంగతి ఎలా ఉన్నా.. ముందు రైల్వేజోన్ తప్పక వస్తుందని అనుకున్నారు. ఆ మేరకు భాజపా నాయకులు కూడా నమ్మారు. రాష్ట్రమంతా ఎవరికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రెచ్చిపోయి ప్రకటనలు చేశారు. రైల్వేజోన్ నేడో రేపో వస్తుంది, ఆ వెంటనే కడప ఉక్కు పరిశ్రమ వస్తుంది అంటూ ప్రకటనలు గుప్పించారు. తీరా అదీ అడియాసే అని తేలిపోయింది. ఇన్నాళ్లూ ఒదిశా ఒప్పుకోవాలని సాకులు చెబుతూ నాన్చిన కేంద్ర.. ఇప్పుడు అసలు కుదర్దు పొమ్మంది. ఈ నిర్ణయం.. ఏపీ ప్రజలకే కాదు, ఇన్నాళ్లూకేంద్రం భజన చేసిన భాజపానేతలకు కూడా అశనిపాతమే.

అలాగే.. కడప ఉక్కు పరిశ్రమ కూడా అంత ఈజీగా రాకవపోచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. ఎంతో సింపుల్ ఏర్పాటు, కేవలం సాంకేతిక అడ్జస్ట్ మెంట్ మాత్రమే అయిన రైల్వేజోన్ విషయంలోనే ఏపీ బాగుపడడం ఇష్టం లేదన్నట్టుగా కేంద్రం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తోంటే.. ఇక వేల కోట్ల రూపాయల నిధులు కుమ్మరించాల్సిన కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఓకే చెప్తారా... అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి కేంద్రం వైఖరి చూస్తోంటే.. ప్రస్తుతానికి రాష్ట్రంలోర కొనఊపిరితో ఉన్న భాజపాకు వారే తక్షణం సమాధి కట్టేసేలా ఉన్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.