Begin typing your search above and press return to search.

సామాజిక గ‌ళంపై మోడీ ఉక్కు పాదం.. విమ‌ర్శ‌ల జోరు అలా ఇలా లేదుగా

By:  Tupaki Desk   |   4 Feb 2021 8:00 AM IST
సామాజిక గ‌ళంపై మోడీ ఉక్కు పాదం.. విమ‌ర్శ‌ల జోరు అలా ఇలా లేదుగా
X
ప్ర‌భుత్వాలు ఏం చేసినా.. నోరు మూసుకుని భ‌రించే రోజులు ఇప్పుడు లేవు. ప్ర‌భుత్వాలు ఏవైనా.. పాల‌కులు ఎంత‌టి వారైనా.. వారు తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. స‌వ్యంగా ఉంటే.. ప్ర‌శంస‌లు.. ఇబ్బంది క‌రంగా ఉంటే.. విమ‌ర్శ‌లు స‌ర్వ‌సాధ‌ర‌ణం అయ్యాయి. సోష‌ల్ మీడియా మాధ్య‌మాలు అందుబాటులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో వాట్సాప్, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప‌లు మాధ్య‌మాల్లో ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేస్తున్నారు.

త‌మ మ‌న‌సులోని మాట‌ల‌ను నిర్మొహ‌మాటంగా వెల్ల‌డిస్తున్నారు. అయితే.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌ప్పుడు.. వాటికి ప్రాదాన్యం ఇచ్చి.. ప‌దే ప‌దే ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌స్తావిస్తున్న ప్ర‌భుత్వాలు.. అదే ఏమాత్రం త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్నా.. వెంట‌నే స‌ద‌రు పోస్టుల‌పై కేసులు పెట్ట‌డం, ఏకంగా ఆయా ఖాతాల‌ను తొల‌గించేలా ఆదేశాలు జారీ చేయ‌డం ప‌రిపాటిగా మారింది.

తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం కూడా ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విమ‌ర్శ‌లు దేశంలోని ఆ చివ‌రి నుంచి ఈ చివ‌రి వ‌ర‌కు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ప్ర‌పంచ దేశాలు సైతం మోడీ వైఖ‌రిపై విస్తుపోతున్నాయి. ప్ర‌స్తుతం రైతులు త‌మ‌కు వ్య‌తిరేకంగా తీసుకువ‌చ్చిన సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నే డిమాండ్‌తో ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా దేశంలోని ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు, మేదావులు త‌మ వాయిస్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వినిపిస్తున్నారు. ఇక‌, ప్ర‌పంచ దేశాల నుంచి కూడా రైతుల‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దీంతో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన మోడీ స‌ర్కారు.. పైకి సౌమ్యంగా ఉంటూనే .. స‌ద‌రు సోష‌ల్ మీడియా గ‌ళాల‌పై మాత్రం ఉక్కుపాదం మోపుతోంది.

ఈ నేప‌థ్యంలోనే మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లీగల్ నోటీసును పంపించింది. రైతుల నిరసనలకు మద్దతు పలుకుతున్న కొన్ని ఖాతాలను నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని తప్పు బట్టింది. మొదట ఈ ఖాతాలను నిలిపేసి, ఆ తర్వాత పునరుద్ధరించినందుకు పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్సన్ 69ఏ ప్రకారం ఐటీ మంత్రిత్వ శాఖ ట్విటర్‌కు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్న దాదాపు 100 ట్విటర్ అకౌంట్లను, 150 ట్వీట్లను ట్విటర్ నిలిపేసింది. ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అనంతరం ట్విటర్ వీటిని పునరుద్ధరించింది. అయితే.. వీటిని పున‌రుద్ధ‌రించ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ.. మ‌ళ్లీ నోటీసులు జారీ చేయ‌డం వివాదంగా మారింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా నే కాకుండా.. ప్ర‌పంచ దేశాల నుంచి కూడా మోడీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.