Begin typing your search above and press return to search.

విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం ఓకే.. క్రెడిట్ కోసం టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ!

By:  Tupaki Desk   |   11 Dec 2021 2:30 AM GMT
విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం ఓకే.. క్రెడిట్ కోసం టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ!
X
రాష్ట్ర విభ‌జ‌న హామీల్లో కీల‌క‌మైన విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాల వ్య‌వ‌హారానికి కేంద్రం ఎట్ట‌కేల‌కు పచ్చ జెండా ఊపింది. ఈ కార్య‌క‌లాపాల‌ను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నాయకులు మిధున్‌ రెడ్డి పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు వైష్ణవ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు.

అయితే.. ఇది అంద‌రూ ఆహ్వానించే ప‌రిణామ‌మే అయిన‌ప్ప‌టికీ.. కొన్ని సంవ‌త్స‌రాలుగా మూల‌న‌ప‌డిన ఈ వ్య‌వ‌హారంపై ఒక్క‌సారిగా క‌ద‌లిక రావ‌డంతో అటు టీడీపీ, ఇటు వైసీపీలు ఈ క్రెడిట్‌ను త‌మ ఖాతాలో వేసుకోవాలంటే.. త‌మ ఖాతాలో వేసుకోవాల‌నే విధంగా అప్పుడే రాజ‌కీయాలు చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీడీపీ ఎంపీలు.. క‌న‌క మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌, రామ్మోహ‌న్ నాయుడు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు గురించి ప్రశ్న లేవనెత్తారు. దీనికి స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. జోన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో చెప్పలేమని బదులిచ్చారు. ఇది గురువారం జ‌రిగింది.

అయితే.. శుక్ర‌వారం ఉద‌యానికి మాత్రం మంత్రి సానుకూలంగా స్పందించారు. విశాఖ రైల్వేజోన్‌ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దీంతో తాము ఈ ప్ర‌తిపాద‌న‌ను పార్ల‌మెంటులో ప్ర‌శ్నించాం కాబ‌ట్టే.. కేంద్రం ప్ర‌క‌ట‌న ఇచ్చింద‌ని.. టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు ఇదే విష‌యంపై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కూడా ప్ర‌క‌టించారు. తాము చేసిన‌.. పోరాటం.. కేంద్రాన్ని పార్ల‌మెంటులో నిల‌దీసిన విధానం వ‌ల్లే కేంద్రం దిగివ‌చ్చింద‌ని అన్నారు. అయితే.. ఇది జ‌రిగిన రెండు మూడు నిముషాల‌కే వైసీపీ ఎంపీలు.. విజ‌య‌సాయిరెడ్డి , మిథున్‌రెడ్డి మ‌రో ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

త‌మ క‌ష్టం వ‌ల్లే కేంద్రం విశాఖ రైల్వే జోన్‌కురెడీ అయింద‌ని.. గురువారం సాయిరెడ్డి ప్ర‌ధాన మంత్రిని క‌లిసి.. దీనిపై ప్ర‌త్యేకంగా విన్న‌వించార‌ని.. సో.. అందువ‌ల్లే ఇది సాధ్య‌మైందని.. టీడీపీ ఎంపీలు కేవ‌లం ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యార‌ని.. కానీ.. తాము ప‌నిజ‌రిగే వ‌ర‌కు కేంద్రాన్ని వెంటాడామ‌ని.. వారుప ఏర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా విశాఖ జోన్ కార్య‌క‌లాపాలు మొద‌ల‌వుతున్నాయ‌నే ఆనందం ఉన్నా.. దీని క్రెడిట్ కోసం.. ఇంకా ఏపీకి కూడా చేరుకోకుండానే .. టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు అప్పుడే మాట‌ల యుద్ధం చేసుకోవ‌డం విస్తుగొలుపుతోంది.