Begin typing your search above and press return to search.

రాష్ట్ర ప్రయోజనాలతో కేంద్రం ఆడుకుంటోందా ?

By:  Tupaki Desk   |   5 Nov 2020 12:30 PM GMT
రాష్ట్ర ప్రయోజనాలతో కేంద్రం ఆడుకుంటోందా ?
X
తాజాగా జురుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కేయటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో సమైన ఏపిని విభజించాలని డిసైడ్ చేసింది. దానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సంపూర్ణ మద్దతిచ్చింది. అంటే కాంగ్రెస్+బీజేపీ కలిసే రాష్ట్ర విభజన చేశాయి. విభజన సందర్భంగా అప్పటి బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు పార్లమెంటులో చేసిన సూచనలను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదించారు. ఆ మేరకు రాజ్యసభలో ఓ ప్రకటన కూడా చేశారు.

కాలం గిర్రున తిరిగి 2014 ఎన్నికల్లో యూపీఏ ప్రతిపక్షంలోకి వస్తే ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది బీజేపీ నేతృత్వంలొనే కేంద్రప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏపి ప్రయోజనాలకు ఇబ్బందే లేదని అనుకున్నారు. దానికి తగ్గట్లే ఎన్నికల సమయంలో ఏపిలో పర్యటించిన నరేంద్రమోడి, వెంకయ్యనాయుడు కూడా పారమెంటులో జరిగన ప్రహసనాలను, విభజన చట్టాన్నే పదే పదే ప్రస్తావించారు. కానీ ఎన్డీయే అధికారంలోకి రాగానే సీన్ మొత్తం రివర్సయిపోయింది.

ఇచ్చిన హామీలను, విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏపి ప్రయోజనాలను పక్కనపడేశారు. విభజన చట్టంలో ప్రధానమైన ప్రత్యేకహోదా ఇచ్చేది లేదన్నారు. తర్వాత ఉత్తరాంధ్ర జనాలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ సాధ్యం కాదన్నారు. ఆ తర్వాత వెనుకబడిన జిల్లాలకు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక నిధులను నిలిపేశారు.

తాజాగా పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కూడా కోత వేసేశారు. కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రూ .20, 398 కోట్లదే కేంద్రం బాధ్యతగా చెప్పేసింది. పునరావాసం, భూసేకరణ వ్యయం తదితరాలతో తమకు సంబందం లేదని తేల్చేసింది. ఇపుడిదే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద వివాదంగా మారింది. తనంతట తానుగా ప్రాజెక్టును నిర్మించే స్ధితిలో రాష్ట్రప్రభుత్వం లేదు. కేంద్రం కూడా నిధులిచ్చేది లేదని భీష్మించుకుని కూర్చుంది.

జరుగుతున్నదంతా చూస్తుంటే ఏపి ప్రయోజనాలతో కేంద్రం ఆడుకుంటోందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ అనుమానాలకు కారణం ఏమిటంటే బీజేపీకి కనుచూపు మేరలో ఎక్కడా పుంజుకునే అవకాశం లేకపోవటమే. కేంద్రంలోను, ఉత్తరాధిలోను బీజేపీ చాలా బలంగా ఉన్న ఏపిలో మాత్రం జీరోనే. ఎన్ని నిధులిచ్చినా పార్టీ పుంజుకునే అవకాశం కనిపించని కారణంగానే ఏపిని కేంద్రం పట్టించుకోవటం లేదనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్లే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీల్లోని అనైక్యత కూడా కేంద్రానికి కలసివస్తోంది. ప్రధానపార్టీలైన వైసీపీ, టీడీపీలకు ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టే కేంద్రం ప్రతి విషయంలోను అడ్వాంటేజ్ తీసుకుంటోంది. చూద్దాం ఎంత కాలం ఇలా ఆడుకుంటుందో.