Begin typing your search above and press return to search.

కశ్మీర్ కు మరో 25వేల సైనికుల్ని పంపుతూ మోడీ సర్కార్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   2 Aug 2019 5:25 AM GMT
కశ్మీర్ కు మరో 25వేల సైనికుల్ని పంపుతూ మోడీ సర్కార్ సంచలన నిర్ణయం
X
గతంలో ఎప్పుడూ లేని రీతిలో కశ్మీర్ కు వేలాది మంది సైనికుల్ని తరలిస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగానే కాదు హాట్ టాపిక్ గా మారింది. రెండు..మూడు రోజుల క్రితం పది వేలమంది అదనపు బలగాల్ని కశ్మీర్ కు పంపాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం ఒక సంచలనమైతే.. కేవలం రెండు రోజుల వ్యవధిలో మరో పాతికవేల మంది సైన్యాన్ని పంపాలని నిర్ణయించటం విస్మయంగా మారింది.

ఇప్పటికే కశ్మీర్ లో అమర్ నాథ్ యాత్ర కోసం 40వేల మంది సైనికుల్ని జమ్ముకశ్మీర్ కు పంపింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ఈ నెల నాలుగు వరకూ యాత్రను రద్దు చేశారు. అమర్ నాథ్ యాత్ర కోసం వెళ్లిన సిబ్బందిని సైతం కశ్మీర్ వ్యాలీలోని వివిధ ప్రాంతాలకు శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం పంపినట్లుగా చెబుతున్నారు. అంటే.. కశ్మీర్ వ్యాలీలో రెగ్యులర్ గా ఉంటే సైనిక.. పోలీసు బలగాలకు అదనంగా 75 వేల మంది సైనికుల్ని పంపుతున్న వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది. మోడీ ప్రభుత్వం ఏం చేయనుంది? ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారు? ఇప్పటికే పుకారుగా మారిన ఆర్టికల్ 35 ఏ రద్దు చేయాలని డిసైడ్ చేశారు.

ఒకవేళ అందరూ ఊహిస్తున్నట్లుగా ఆర్టికల్ 35 ఏ ను రద్దు చేసిన పక్షంలో కశ్శీర్ లో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. అందరూ అనుకుంటున్నట్లుగా 35 ఏను రద్దు చేయాలని తాము అనుకోవటం లేదని కేంద్రం చెబుతోంది. అలాంటిదేమీ లేదన్నప్పుడు ఇంత భారీగా ఎందుకంత సైన్యాన్ని కశ్శీర్ వ్యాలీలో మొహరిస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

వేల కొలదీ సైన్యం వ్యాలీలో మొహరించటంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఆర్టికల్ 35ఏతో పాటు ప్రత్యేక హోదాను కూడా రద్దు చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ కేంద్రం కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే రాజకీయాలకు అతీతంగా కశ్మీర్ లోని పార్టీలన్ని కలిసి కట్టుగా పోరాడాలని మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైతే ఆస్తులు.. ప్రాణాలు కోల్పోయేందుకైనా సిద్ధం కావాలంటూ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. ఒకవేళ మోడీ సర్కారు కానీ తాము ఊహించినట్లే సంచలన నిర్ణయాన్ని తీసుకున్న పక్షంలో దాన్ని ఎదుర్కొంనేందుకు కశ్మీరీలు కూడా సిద్ధమవుతున్నట్లుగా చెప్పాలి. అదే జరిగితే.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఊహలకు అందని రీతిలో మారిందని చెప్పక తప్పదు.