Begin typing your search above and press return to search.

జగన్ ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ బాగానే కనబడుతోందే ? ఎంపిపై సీబీఐ కేసు

By:  Tupaki Desk   |   9 Oct 2020 10:30 AM IST
జగన్ ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్ బాగానే కనబడుతోందే ? ఎంపిపై సీబీఐ కేసు
X
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రభావం చాలా స్పీడుగానే కనబడుతున్నట్లుంది. పార్టీలో తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఇల్లు, ఆఫీసులపై సీబీఐ దాడులు చేసి కేసు నమోదు చేసింది. ఎంపితో పాటు ఆయన కంపెనీకి చెందిన తొమ్మిదిమంది డైరెక్టర్ల ఇళ్ళు, కార్యాలయాలపైన కూడా ఏకకాలంలో దాడులు చేసి అందరిపైనా చీటింగ్ కేసులు నమోదు చేసింది. కర్నాటకలో థర్మల్ ప్లాంటు ఏర్పాటు కోసమని బ్యాంకుల కన్సార్షియం దగ్గరు రూ. 2226 కోట్లు ఎంపి అప్పు తీసుకున్నారు. అయితే తర్వాత ప్లాంటును కర్నాటకలో కాకుండా తమిళనాడుకు తరలించారట.

ఇదే సమయంలో బ్యాంకు నుండి తీసుకున్న అప్పులో రూ. 926 కోట్లు దుర్వినియోగం చేసినట్లు కూడా బ్యాంకుల కన్సార్షియం కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయటం కేంద్రం ఆదేశాలతో ఈడీ కేసు నమోదు చేసుకుని విచారణ జరగటం ఎప్పుడో అయిపోయింది. ఈడీ విచారణ పూర్తయిన సందర్భంలోనే ఎన్నికలు రావటం, కృష్ణంరాజు ఎంపిగా గెలవటంతో తర్వాత చర్యలకు బ్రేకులు పడిపోయాయి. ఇదే సమయంలో వైసిపి తరపున గెలిచిన ఎంపి పార్టీలైను మీద కాకుండా స్వతంత్రంగా వ్యవహిరించటం మొదలుపెట్టారు. ఇదే విషయమై పార్టీ నాయకత్వానికి ఎంపికి మధ్య అగాధం మొదలైంది. దాన్ని అడ్వాంటేజిగా తీసుకున్న ఎంపి నేరుగా జగన్నే టార్గెట్ చేయటం మొదలుపెట్టారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏచిన్న ఘటన జరిగినా దాన్ని జగన్ కు ముడిపెట్టేయటం, జగన్ హిందువు కాదంటూ పదే పదే విమర్శలు చేయటం అందరికీ తెలిసిందే. దాంతో ఇక లాభం లేదని భావించిన పార్టీ నాయకత్వం ఎంపిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేసింది. ఫిర్యాదు తర్వాత ఎపిం జగన్ పై మరింతగా రెచ్చిపోవటం మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే జగన్ రెండుసార్లు ఢిల్లీలో పర్యటించారు. మొదటి పర్యటనలో రెండుసార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోను తాజా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడితోను భేటి అయ్యారు.

తన రెండు పర్యటనల్లోను ప్రధాని, హోంశాఖ మంత్రితో భేటి సందర్భంగా ప్రస్తావించిన అనేక అంశాల్లో కృష్ణంరాజుపై అనర్హత వేటు విషయం కూడా ఉందని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సీబీఐ చేసిన దాడులు, నమోదు చేసిన చీటింగ్ కేసులో ఎంపి భార్య కనుమూరు రమాదేవి, కూతురు కోటగిరి ఇందిరా ప్రియదర్శిని కూడా ఉండటం. హఠాత్తుగా ఎంపి ఇళ్ళు, కార్యాలయాలపైనే కాకుండా డైరెక్టర్లపైన కూడా దాడులు చేయటం, చీటింగ్ కేసులు నమోదు చేయటం చూస్తుంటే ఇదంతా జగన్ ఢిల్లీ పర్యటన ప్రభావమే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.