Begin typing your search above and press return to search.

సీఎం జగన్ పై సీబీఐ కోర్టు అసహనం!

By:  Tupaki Desk   |   21 Dec 2021 9:21 PM IST
సీఎం జగన్ పై సీబీఐ కోర్టు అసహనం!
X
అక్రమాస్తుల కేసుల విచారణకు సీబీఐ కోర్టుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ విచారణకు హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటని జగన్ తరుఫు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై జగన్ తరుఫు న్యాయవాది స్పందించారు.

 కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోసం హైకోర్టులో పిల్ వేశామని.. కోర్టు తీర్పు రావాల్సి ఉందని కోర్టుకు వివరించారు. అందుకే కోర్టుకు హాజరు కావడం లేదని జగన్ తరుఫు లాయర్ కోర్టుకు తెలిపారు.

జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాల్సినప్పుడల్లా జగన్ ఏదో ఓ కారణం చెప్పి గైర్హాజరవుతున్నారు. మంగళవారం జరిగిన విచారణకు కూడా హాజరు కాకపోవడంతో ఈ అంశంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి తాజాగా అసహనం వ్యక్తం చేశారు. ప్రతి విచారణకు మినహాయింపు కోరుతున్నారని.. విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని సీబీఐ కోర్టు ప్రశ్నించింది.

హాజరు మినహాయింపుపై హైకోర్టులో తీర్పు రావాల్సి ఉందని.. అందుకే రావడం లేదని జగన్ తరుఫున న్యాయవాది చెప్పారు. ఇదే వివరాలతో మెమో దాఖలు చేయాలని జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశించింది.

దీంతో జగన్ అవే వివరాలతో మెమో సమర్పించారు. ఎవరైనా కోర్టులో తీర్పు వచ్చి విచారణకు హాజరు కాకుండా మినహాయింపు వస్తే హాజరు కాకుండా ఉంటారు. కానీ కోర్టులో పిటీషన్ వేశామన్న కారణంగా విచారణకు హాజరు కావడం లేదని కోర్టులో మెమో దాఖలు చేయడం గమనార్హం.