Begin typing your search above and press return to search.

మ‌రో బ్యాంక్ స్కాం..ఇది కూడా గుజ‌రాత్‌ లోనే

By:  Tupaki Desk   |   6 April 2018 5:27 AM GMT
మ‌రో బ్యాంక్ స్కాం..ఇది కూడా గుజ‌రాత్‌ లోనే
X
మ‌రో బ్యాంక్ స్కాం వెలుగులోకి వ‌చ్చింది. బ్యాంకుల్ని ముంచిన కార్పొరేట్ల జాబితాలో మరో సంస్థ చేరింది. అది కూడా గుజరాత్‌ కు చెందింది కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గుజ‌రాత్‌ కు చెందిన డైమండ్ పవర్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (డీపీఐఎల్).. యాక్సిస్ బ్యాంక్ - బ్యాంక్ ఆఫ్ ఇండియా - బ్యాంక్ ఆఫ్ బరోడా - ఐసీఐసీఐ సహా 11 బ్యాంకులను రూ.2,654 కోట్ల మేర మోసం చేసింది. ఈ మోసానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వడోదర కేంద్రంగా నడుస్తున్న డీపీఐఎల్ - దాని డైరెక్టర్లపై క్రిమినల్ కేసును దాఖలు చేసినట్లు సీబీఐ తెలియజేసింది. సదరు సంస్థ కార్యాలయాలు - డైరెక్టర్ల నివాసాల్లో సోదాలను కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎలక్ట్రిక్ కేబుల్స్ - ఎక్విప్‌ మెంట్ తయారీదారైన డీపీఐఎల్.. ప్రభుత్వ - ప్రైవేట్ రంగానికి చెందిన 11 బ్యాంకుల నుంచి మోసపూరితంగా రుణాలు పొందింది. 2008 నుంచి ఈ వ్యవహారం జరుగగా - 2016 జూన్ 29 నాటికి రుణ బకాయిలు రూ.2,654.40 కోట్లకు చేరాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని నిరర్థక ఆస్తిగా బ్యాంకుల కూటమి ప్రకటించింది. ఎస్ ఎన్ భట్నాగర్ - ఆయన కుమారులు అమిత్ భట్నాగర్ - సుమిత్ భట్నాగర్ ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీ వాస్తవాలను మరుగునపెట్టి టర్మ్ లోన్లు - ఇతరత్రా రుణాలు పొందిందని సీబీఐ చెబుతున్నది. తప్పుడు ప్రకటనలతో బ్యాంకుల నుంచి రుణాలు అందుకుందని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ ఎగవేతదారుల జాబితాలో వీరి పేర్లున్నాయని - ఎక్స్‌ పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) కూడా వీరితో జాగ్రత్త అని హెచ్చరిస్తుందని వివరించింది.

కాగా, టర్మ్ లోన్లకు యాక్సిస్ బ్యాంక్ - నగదు రుణ పరిమితులకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలు లీడ్ బ్యాంకులుగా ఉన్నాయి. పలు బ్యాంకులకు చెందిన అధికారులతో చాలా సఖ్యతగా ఉంటూ...రుణ పరిమితులను సంస్థ పెంచుకున్నదని సీబీఐ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బకాయిలు రూ.670.51 కోట్లుగా ఉంటే, బ్యాంక్ ఆఫ్ బరోడా బాకీ రూ.348.99 కోట్లుగా ఉన్నది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కూడా రూ.279.46 కోట్ల మేర డీపీఐఎల్ రుణం పొందినట్లు ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.