Begin typing your search above and press return to search.

కోడ‌లు కోసం మామ‌!...అడ్డంగా బుక్కైన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   4 April 2019 8:31 AM GMT
కోడ‌లు కోసం మామ‌!...అడ్డంగా బుక్కైన‌ట్టేనా?
X
ఎన్నిక‌ల వేళ‌... త‌మ‌పై ఇటు వైసీపీతో పాటు అటు తెలంగాణ‌లోని అధికార పార్టీ టీఆర్ ఎస్‌ - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... అన్ని వైపుల నుంచి టార్గెట్ చేశార‌ని ఆరోపిస్తున్న ఏపీలోని అధికార పార్టీ టీడీపీ ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. నిజ‌మే.... అన్ని వైపుల నుంచి ఎక్క‌డ త‌ప్పు దొరుకుతుందోన‌ని వైరి వ‌ర్గాలు కాసుక్కూర్చున్న వేళ‌... టీడీపీ నేత‌లు మ‌రింత జాగ‌రూక‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. అయితే టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు అత్యంత స‌న్నిహితుడిగానే కాకుండా బాబు కోట‌రీలో అత్యంత కీల‌క‌మైన నేత‌గా ప‌రిగ‌ణిస్తున్న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ - ఇప్పుడు అక్క‌డ పోటీ చేస్తున్న అభ్య‌ర్థి మాగంటి రూప మామ‌గారు మాగంటి ముర‌ళీమోహ‌న్ ఈ త‌ర‌హా జాగ్ర‌త్త‌లు ఏమాత్రం తీసుకున్న‌ట్లుగా క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఏపీపై క‌క్ష క‌ట్టిన తెలంగాణ స‌ర్కారు అవ‌కాశం కోసం కాసుక్కూర్చుంద‌ని నిత్యం ఆరోపిస్తున్న చంద్ర‌బాబు మాట‌ల‌ను చాలా లైట్ గానే తీసుకున్న ముర‌ళీమోహ‌న్ ఇప్పుడు పెద్ద ఇబ్బందిలోనే చిక్కుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎప్పుడెప్పుడు టీడీపీని ఒత్తేద్దామా? అన్న కోణంలో ఎదురుచూస్తున్న కేసీఆర్ స‌ర్కారుకు ఇప్పుడు మురళీమోహ‌న్ అప్ప‌నంగా ఓ బ్ర‌హ్మాస్త్రాన్ని ఇచ్చిన‌ట్గుగా కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా ఏం జ‌రిగిందన్న విష‌యానికి వ‌స్తే... నిన్న రెండు సూట్ కేసుల్లో నిండా నోట్ల క‌ట్ట‌ల‌తో రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి బ‌య‌లుదేరేందుకు య‌త్నించిన ఇద్ద‌రు వ్య‌క్తు లు నిమ్మలూరి శ్రీహరి - ఆరుతి పండరిల‌ను తెలంగాణ పోలీసులు ప‌ట్టేసుకున్నారు. ఆ డ‌బ్బెక్క‌డిద‌ని - ఎక్క‌డికి తీసుకెళుతున్నార‌న్న ప్ర‌శ్న‌ల‌కు వారు బెంబేలెత్తిపోయి అస‌లు నిజాల‌ను చాలా ఈజీగానే వెల్ల‌డించేశారు.

వారు చెప్పిన వివ‌రాల మేర‌కు... నిమ్మలూరి శ్రీహరి - ఆరుతి పండరిలు టీడీపీ సీనియ‌ర్ నేత‌ - రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్‌ కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ జ‌య‌భేరీకి చెందిన వారే. ముర‌ళీమోహ‌న్ ఆదేశాల మేర‌కే సంస్థ‌కు చెందిన రూ.2 కోట్ల‌ను సూట్ కేసుల్లో కుక్కుకుని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం బ‌య‌లుదేరారు. రాజ‌మ‌హేంద్రికి చేరిన త‌ర్వాత స‌ద‌రు డ‌బ్బును ముర‌ళీమోహ‌న్ కోడలు - ప్ర‌స్తుతం టీడీపీ త‌ర‌ఫున రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న మాగంటి రూప‌కు అంద‌జేయాల్సి ఉంద‌ని కూడా వారు నిజం ఒప్పేసుకున్నార‌ట‌. అస‌లే ఎన్నిక‌ల స‌మ‌యం... ఆపై ఎప్పుడెప్పుడు ప్ర‌త్య‌ర్థి దొరుకుతాడా? అంటూ ఎదురు చూస్తున్న వైరి వ‌ర్గం... వెర‌సి అన్ని వ‌ర్గాలూ టార్గెట్ చేసిన స‌మ‌యంలో ముర‌ళీమోహ‌న్ ఈజీగానే దొరికిపోయారు. ఇలాంటి నేప‌థ్యంలో ముర‌ళీమోహ‌న్ ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కోబోతున్నారో చూడాలి.