Begin typing your search above and press return to search.

జోహార్ దీపక్ వసంత్..అసమాన ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్న ప్యాసెంజర్స్!

By:  Tupaki Desk   |   8 Aug 2020 10:45 AM GMT
జోహార్ దీపక్ వసంత్..అసమాన ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్న ప్యాసెంజర్స్!
X
కొజికోడ్‌ విమానాశ్రయానికి చేరుకున్న ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌’ విమానం అనూహ్యంగా అదుపుతప్పి, 35 అడుగుల లోయలో పడిపోవడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పైలట్లు వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేష్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. అయితే, తన ప్రాణాలని పనంగా పెట్టి..ప్రయాణికుల్ని కాపాడారు. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ వారు షాక్ నుంచి ఇంకా బయటపడలేదు. కానీ, తాము ప్రాణాలతో బయటపడటానికి ఏకైక కారణం పైలట్ దీపక్ వసంత్ సాతే అని చెప్తున్నారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత మంటలు అంటుకోకుండా చాకచక్యంగా వ్యవహరించారు.

అతను కనబరిచిన ధైర్య సాహసాలతో తాము ఊపిరి పీల్చుకుంటున్నామని చెప్తున్నారు. దీపక్ సాతే మంచి అనుభవనం ఉన్న పైలట్ అందుకోసమే విమానం రెండు ముక్కలైన.. భారీ ప్రాణ నష్టం కాకుండా నివారించగలిగారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌ డీఏ) లో ప్రారంభ శిక్షణ పూర్తి చేసుకున్న సాథే... అనంతరం హైదరాబాద్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో పైలట్‌ శిక్షణ పొందారు. అత్యుత్తమ ప్రదర్శనతో 1981లో కోర్సును పూర్తి చేసి ‘స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ కూడా సాధించారు. అంతేకాదు సాథేకు ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ 310ను నడిపిన అనుభవం ఉంది.. కమర్షియల్ పైలట్ కావాలని నిర్ణయించుకునే ముందు యుద్ధ విమానాలు నడపడంలో నిష్ణాతుడిగానూ గుర్తింపు పొందారు.

టేబుల్‌ లాంటి రన్‌ వే.. రన్ ‌వే కి ఇరువైపులా చిన్నపాటి లోయలా ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. తాజాగా విమాన ప్రమాదం జరిగిన కేరళలోని కొజికోడ్‌ విమానాశ్రయం కూడా ఇలాంటిదే. శుక్రవారం రాత్రి విమానం ల్యాండయ్యే సమయంలో వర్షం కురవడం, రన్ వే పై వర్షపు నీరు ఉండటంతో దీపక్ దానిని సరిగా అంచనా వేయలేకపోయారు. రెండుసార్లు అదుపుతప్పిన సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారని.. కానీ స్కిడ్ అయ్యి రెండు ముక్కలైందని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు ఒకరు తెలిపారు. అయన ప్రతిభ వల్లే మేము మళ్లీ ప్రాణాలతో అందరిని చూడగలుగుతున్నాం అని అన్నారు.ప్రమాదం తర్వాత నోట మాట రాలేదని.. ఆక్సిడెంట్‌కు సంబంధించి ఏమీ గుర్తులేదని మరో ప్రయాణికుడు తెలిపారు.

దీపక్‌ వసంత్‌ సాథే దుర్మరణంతో ఆయన తల్లిదండ్రులు తీరని విషాదంలో మునిగిపోయారు. వృద్ధాప్యంలో తమకు కొండంత అండగా ఉన్న తమ అభిమాన దీపక్ ఇకలేడన్న వార్త వారిని తీవ్రంగా కలచి వేసింది. గత కొంతకాలం క్రితం జరిగిన ప్రమాదంలో తమ మరో కుమారుడిని ఈ దంపతులు కోల్పోవడం మరో ఘోర విషాదం. నా కొడుకు చాలా గొప్పవాడు. అవసరమైనవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వాడు అంటూ తల్లి నీలా సాథే దివంగత కెప్టెన్ దీపక్ సాథేని గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరు కుమారులు ఇలా తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోవడాన్ని మించిన విషాదం ఏముంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది కెప్టెన్ సాథేతో తమ అనుబంధాన్ని తలుచుకుంటూ, ఆయన అభిమానులు, సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.