Begin typing your search above and press return to search.

ఏపీలో మంత్రికి వైసీపీలో అభ్య‌ర్థులు దొర‌క‌క.. టీడీపీ నుంచి తీసుకున్నారంట‌..!

By:  Tupaki Desk   |   28 Feb 2021 8:00 PM IST
ఏపీలో మంత్రికి వైసీపీలో అభ్య‌ర్థులు దొర‌క‌క.. టీడీపీ నుంచి తీసుకున్నారంట‌..!
X
మునిసిపల్ ఎన్నికలు మొదలు కాకుండానే.. అచ్చెన్నాయుడి ఇలాకాలాలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. శ్రీకాకుళం జిల్లా పలాస మునిసిపాలిటీ పరిధిలో టీడీపీ నుంచి నామినేషన్ వేసిన నలుగురు కౌన్సిలర్‌ అభ్యర్థులు.. తాజాగా అధికార వైసీపీలో చేరారు. 4, 8, 20, 29 వార్డుల అభ్యర్థులైన లక్ష్మణ్‌రావు, మురళీకృష్ణ, వెంకటలక్ష్మి, హరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు.

ఆహ్వానించిన మంత్రి..

మంత్రి అప్పలరాజు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందే నలుగురు అభ్యర్థులు వైసీపీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. కాగా.. వీరిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి అప్పలనాయుడు తీవ్రంగా ప్రయత్నించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో త‌మ అభ్య‌ర్థుల‌ను కిడ్నాప్ చేశార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఇంత అవ‌స‌ర‌మా..?

స్థానికంగా మాత్రం మంత్రి తీరుపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతామంటూ కోరుతున్నా.. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్స‌హించ‌ట్లేద‌ని, కానీ.. మంత్రి అప్ప‌ల‌నాయుడు మాత్రం అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేసిన వార్డు కౌన్సిల‌ర్ అభ్య‌ర్థుల‌ను పార్టీలోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నామినేషన్లు వేసిన త‌ర్వాత‌.. ఉప‌సంహ‌ర‌ణ‌కు ముందు ఇలా వైసీపీ కండువా క‌ప్పాల్సిన అవ‌స‌రం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో అభ్య‌ర్థులు దొర‌క‌క, టీడీపీ నుంచి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థుల‌ను తీసుకున్నారా? అని నిల‌దీస్తున్నారు.

సొంత పార్టీలోనూ భిన్న‌స్వ‌రాలు..

టీడీపీ నుంచి న‌లుగురు కౌన్సిల‌ర్ అభ్య‌ర్థులను వైసీపీలో చేర్చుకోవ‌డం పై సొంత పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణ‌యానికి కొంద‌రు మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా.. మ‌రికొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. గ‌తంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఇలాగే చేసింద‌ని, ఇప్పుడు మ‌నం కూడా అలాగే చేస్తే త‌ప్పేంకాద‌ని ప‌లువురు మంత్రి నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తున్నారు.

అయితే.. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండ‌గా.. విప‌క్ష పార్టీల‌ నుంచి నాయ‌కుల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. ఇప్ప‌టికే పార్టీలో చాలా కాలంగా సిన్సియ‌ర్ గా ప‌నిచేస్తున్న‌వారు ఎందరో ఉన్నార‌ని.. ఇప్పుడు కొత్త‌వారిని తీసుకొస్తే భ‌విష్య‌త్ లో ప‌ద‌వులు, టికెట్ల విష‌యంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పూర్తిస్థాయిలో ఉంద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌లు అవ‌స‌రం లేద‌ని, మంత్రి ఈ విధంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. మ‌రి, దీనిపై మంత్రి అప్ప‌ల‌నాయుడు ఏమంటారో..?!