Begin typing your search above and press return to search.

బద్వేల్ లో బీజేపీకి డిపాజిట్ దక్కేనా.. ?

By:  Tupaki Desk   |   16 Oct 2021 10:24 AM GMT
బద్వేల్ లో బీజేపీకి డిపాజిట్ దక్కేనా.. ?
X
బద్వేల్ ఉప ఎన్నికకు గడువు దగ్గరపడుతోంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. తెలంగాణాలో హుజూరాబాద్ అంత హాట్ హాట్ గా కాకపోయినా బద్వేల్ పోరు ఎంతో కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. అయితే వైసీపీని గట్టిగా ఢీ కొట్టే పార్టీ టీడీపీ రేసులో లేకపోవడంతో ఒక్కసారిగా ఊపు లేకుండా పోయింది. నిజానికి టీడీపీ రంగంలో ఉంటే ఈపాటికి చంద్రబాబు హడావుడి చేసేవారు. చినబాబు లోకేష్ కూడా కలియతిరిగేవారు. అదే సమయంలో వీలు చూసుకుని జగన్ కూడా బద్వేల్ లో మీటింగ్ పెట్టేవారు అన్న మాట ఉంది. మొత్తానికి బద్వేల్ లో ఎన్నికల పోరు సాగుతోంది కానీ అది రంజుగా మాత్రం లేదు అన్నది నిజం.

ఇక బీజేపీ బస్తీమే సవాల్ అంటూ తొడకొడుతోంది. పనతాల సురేష్ ని తమ అభ్యర్ధిగా తెచ్చి పోటీ చేయిస్తోంది. ఈ పనతాల సురేష్ కూడా బద్వేల్ వాసి కాదు, ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన వారు. అలా బీజేపీ బద్వేల్ కి సంబంధం లేని నేతను తెచ్చి పోటీకి నిలపడం ఆశ్చర్యమే అంటున్నారు. అంటే రెండున్నర లక్షల ఓటర్లు ఉన్న బద్వేల్ లో బీజేపీకి లోకల్ క్యాండిడేట్ లేరా అన్న విమర్శలూ ఉన్నాయి. మరో వింత ఏంటి అంటే మిత్ర పక్షం జనసేన తాము పోటీలో లేము ఉండమని ప్రకటించింది. ఆ పార్టీ అలాంటి నిర్ణయం తీసుకున్నాక బీజేపీ ఇగో తో పోటీ చేస్తోందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి రాజకీయాల్లో ఇగోలు అన్నవి అసలు వర్కౌట్ కావు. కేవలం వాస్తవాలే రాజకీయ క్షేత్రంలో బలాబలాలను నిర్ణయిస్తాయి.

బద్వేల్ లో వైసీపీకి ఏకపక్ష విజయం. అది ఎవరూ కాదనలేరు. పైగా అక్కడ గత ఎన్నికల్లో దాదాపుగా లక్ష ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. నాడు అధికారంలో ఉన్న టీడీపీ తరఫున బలమైన అభ్యర్ధిగా రాజశేఖర్ పోటీ చేశారు. అయినా వైసీపీ దూకుడు సాగింది. ఇక ఇపుడు చూస్తే రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోటీ నామమాత్రమే అని వైసీపీ నేతలు అంటున్నారు. బద్వేల్ లో బీజేపీకి ఉన్న నిఖార్సైన బలమెంత అంటే 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 735 ను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. అంటే నాడు లక్షన్నరకు పైగా ఓట్లు పోల్ అయితే అందులో కాషాయం పార్టీకి వచ్చినవి ఈ ఓట్లు అన్న మాట.

మరి ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నదే చర్చ. బీజేపీ లెక్కలు చూసుకుంటే చిత్రంగా లాజిక్ కి అందకుండా ఉన్నాయి. పోటీలో టీడీపీ లేదు, జనసేన లేదు, కాబట్టి ఆ రెండు పార్టీల ఓట్లు తమకే పడతాయి అని బీజేపీ భావిస్తోంది. నాడు టీడీపీకి యాభై వేల ఓట్లు వచ్చాయి. జనసేన మద్దతు ఇచ్చిన బీఎస్పీ అభ్యర్ధికి కూడా రెండువేలకు మించి ఓట్లు రాలేదు. ఇక రెండున్నరేళ్లలో వైసీపీకి వ్యతిరేకత పెరిగింది అని బీజేపీ భావిస్తోంది. అలా ఆ ఓట్లు కూడా కలసివస్తాయని అనుకుంటోంది. కానీ తిరుపతి లోక్ సభ బై పోల్ చూసిన వారికి ఈ లెక్కలు కొంత చిత్రంగానే ఉంటాయి.

సాధారణంగా ఉప ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి ఫేవర్ గా సాగుతాయి. ఈ మధ్యలో విపక్షం నుంచి గెలిచిన వారు ఉంటే డెవలప్మెంట్ కాదు అని జనం భావిస్తారు. ఇక ప్రత్యేకమైన పరిస్థితులు కలసివస్తే తెలంగాణా లోని దుబ్బాక లాంటి రిజల్ట్ రావచ్చు. ఏపీలో అయితే ఎక్కడా సీన్ లేదు. పైగా అది ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో ఉన్న బద్వేల్ సీటు. ఇక బీజేపీకి బేస్ ఎక్కడా లేని ప్రాంతం. దాంతో ఈసారి కూడా బీజేపీకి డిపాజిట్ కి సరిపడా ఓట్లు వస్తాయా అన్నదే చర్చగా ఉంది మరి. డిపాజిట్ దక్కాలీ అంటే కచ్చితంగా పాతిక వేల ఓట్లు దాకా తెచ్చుకోవాలి. మరి ఇపుడున్న స్థితిలో అది జరిగే పనేనా. వేచి చూడాల్సిందే.