Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య ఇది దేశంలోనే తొలిసారి!

By:  Tupaki Desk   |   14 Oct 2022 4:11 AM GMT
ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య ఇది దేశంలోనే తొలిసారి!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల‌ను క‌లుపుతూ కృష్ణా న‌దిపై కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోనే తొలిసారిగా కేబుల్‌, స‌స్పెన్ష‌న్ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జి పూర్త‌యితే హైద‌రాబాద్‌-తిరుప‌తి మ‌ధ్య 80 కిలోమీటర్ల దూరం త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు.

అలాగే ఈ వంతెన పూర్త‌యితే హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వైపు ప్రయాణించేవారికి కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండద‌ని అంటున్నారు. ఏపీ, తెలంగాణ మ‌ధ్య కృష్ణా న‌దిపై రూ.1082.56 కోట్ల‌తో ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్న‌ట్టు కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఐకానిక్ బ్రిడ్జి ఫొటోలను ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు. ప్ర‌పంచ స్థాయి మౌలిక వ‌సతుల‌తో దీన్ని నిర్మించనున్న‌ట్టు గ‌డ్క‌రీ తెలిపారు.

కాగా, దేశంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న కేబుల్, సస్పెన్షన్ ఐకానిక్ బ్రిడ్జి ఇదే కావడం విశేషం. ఇలాంటిది ప్ర‌పంచంలో ఒక‌టి మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇది దేశంలోనే తొలి చ‌రిత్రాత్మ‌క వంతెన‌గా నిల‌వ‌నుంది. మొత్తం 30 నెలల్లో దీన్ని నిర్మించ‌నున్నారు.

ఈ బ్రిడ్జి టూరిస్టు ఎట్రాక్ష‌న్‌గా నిల‌వ‌నుంది. తెలంగాణ‌లో ల‌లిత సోమేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంగ‌మేశ్వ‌ర ఆల‌యం క‌నిపిస్తూ ఉండేలా ఈ బ్రిడ్జి నిర్మాణం కానుంది. అదేవిధంగా నల్ల‌మ‌ల కొండ శిఖ‌రాల అందాలు, కృష్ణాన‌దీ ప్ర‌వాహ హోయలు, శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్‌ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌నున్నాయి.

కాగా బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా పాదచారులు న‌డిచే మార్గాన్ని గాజుతో నిర్మించ‌నున్నారు. పొడవైన గాజు పాదచారుల నడక మార్గం, పైలాన్‌ల వంటి గోపురం, సిగ్నేచర్ లైటింగ్, పెద్ద నావిగేషనల్ స్పాన్ వంటి అనేక ప్రత్యేకతలు ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంటాయ‌ని తెలుస్తోంది.

కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సోమశిల వద్ద కృష్ణా నదిపై ఈ ఐకానిక్‌, సస్పెన్ష‌న్ బ్రిడ్జిని నిర్మించ‌నున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ఈ ప్రాంత ప్ర‌జ‌ల క‌ష్టాలు తొల‌గ‌నున్నాయి. తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి రావాలంటే ఇప్ప‌టివ‌ర‌కు కృష్ణా నదిలో పడవ ప్రయాణమే దిక్కు. గ‌తంలో ఇలా ప్ర‌యాణం చేస్తూనే 60 మందికి పైగా అశువులు బాశారు.

ఈ నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రోడ్డు ద్వారా రాకపోకలు సాగించాలంటే సుమారు 100 కిలోమీటర్లు చుట్టు తిరిగి రావాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో ఈ స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గుతాయి. ప‌ర్యాట‌కంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

అదేవిధంగా ఈ ఐకానిక్, స‌స్పెన్ష‌న్ బ్రిడ్జికి అనుసంధానంగా తెలంగాణలోని కల్వకుర్తి-నాగర్ కర్నూల్-కొల్లాపూర్, ఏపీలోని ఆత్మకూర్-నంద్యాల మార్గాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పటికే జాతీయ రహదారిగా గుర్తించిన సంగ‌తి తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.