Begin typing your search above and press return to search.

బాబాయి బాటలోనే అబ్బాయి..బీజేపీలోకి సిద్ధార్థ రెడ్డి?

By:  Tupaki Desk   |   4 Feb 2020 5:30 PM GMT
బాబాయి బాటలోనే అబ్బాయి..బీజేపీలోకి సిద్ధార్థ రెడ్డి?
X
రాయలసీమ రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బైరెడ్డి ఫ్యామిలీ... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు నానా పాట్లూ పడాల్సి వస్తోంది. బైరెడ్డి ఫ్యామిలీకి చెందిన తొలి తరం నేత బైరెడ్డి శేషశయనారెడ్డి దాదాపుగా కనుమరుగు కాగా... రెండో తరం నేత శయనారెడ్డి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూడా కనుమరుగు అయ్యే సూచనలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు పొలిటికల్ఎంట్రీ ఇచ్చిన బైరెడ్డి మల్లికార్జున రెడ్డి (కడపలో స్థిరపడ్డ వైద్యుడు) కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జిల్లాలో ఓ రేంజిలో ఎలివేట్ అయ్యారు. ప్రస్తుతం వైసీీపీలో ఉన్న సిద్ధార్థ... త్వరలోనే బీజేపీలో చేరతారన్న ప్రచారం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదే జరిగితే... ఇప్పటికే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇటీవలే బీజేపీలో చేరిపోగా... బాబాయి బాటలోనే అబ్బాయి కూడా బీజేపీలో చేరినట్టవుతుంది.

రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి... తన ఫ్యామిలీ రాజకీయ వారసత్వాన్ని ఓ రేంజిలో కొనసాగించారని చెప్పాలి. టీడీపీలో ఉండగా ఎమ్మెల్యేగా గెలిచిన బైరెడ్డి... ఆ తర్వాత తన వైరి వర్గం గౌరు కుటుంబం చేతిలో వరుసగా రెండు పర్యాయాలు ఓటమిపాలయ్యారు. తాజాగా నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంగా మారడంతో అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలే బైరెడ్డి ఫ్యామిలీకి లేకుండా పోయాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సిద్ధార్థ కూడా పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నా... రిజర్వ్ డ్ కారణంగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు లేకుండా పోయాయి.

అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తొగురు అర్థర్ ఘన విజయం సాధించారు. వైసీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటైన నందికొట్కూరులో డీ లిమిటేషన్ తర్వాత వైసీపీనే విజయం వరిస్తూ వస్తోంది. డీ లిమిటేషన్ తర్వాత అక్కడ మూడు ఎన్నికలు జరిగితే.. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత రెండు పర్యాయాలు వైసీపీ విజయం సాధించింది. తాజాగా గెలిచిన ఎమ్మెల్యే అర్థర్ తో ఎన్నికల ముందు వరకు సిద్దార్థకు మంచి సంబంధాలే ఉన్నా... ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఆ విభేదాలు ఇప్పటికిప్పుడు సమసిపోయే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్నా సిద్దార్థకు దాదాపుగా చేతులు కట్టేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ మారితే తప్పించి తాను ఎలివేట్ కాలేనని భావిస్తున్న సిద్ధార్థ... తన బాబాయి చేరిన బీజేపీలోకే వెళ్లేందుకు సిద్ధపడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం... ఏం జరుగుతుందో?