Begin typing your search above and press return to search.

బైరెడ్డి ఎంత నిర్ణ‌యం తీసుకున్నార‌బ్బా!

By:  Tupaki Desk   |   6 Sep 2017 5:21 AM GMT
బైరెడ్డి ఎంత నిర్ణ‌యం తీసుకున్నార‌బ్బా!
X
బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి. రాయ‌ల‌సీమ కోసం - రాయ‌ల‌సీమ జ‌నాల కోసం ప‌దేప‌దే ప‌రిత‌పించిన నేత‌. రాజ‌కీయంగా అనేక మ‌లుపులు తిరిగిన బైరెడ్డి ప్ర‌స్థానం.. తాజాగా ఆయ‌న రాజ‌కీయాల నుంచి విర‌మించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ముగిసిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ఆయ‌న మిత్రులు. ప్రాంతీయాభిమానానికి పూచిన పువ్వ‌యిన రాయ‌ల‌సీమ నుంచి బైరెడ్డి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. తొలుత టీడీపీలో కీల‌క నేత‌గా ఎదిగారు. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1994 - 1999ల‌లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక‌, 2004 - 2009లో మాత్రం ఓట‌మి పాల‌య్యారు.

త‌న‌ను గెలిపించిన నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం పైనే కాకుండా మొత్తం రాయ‌ల‌సీమపై ప్రేమ‌ను కురిపించే రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. సీమ వాసులకు మ‌ద్ద‌తుగా ఏ క‌ష్టం వ‌చ్చినా నిల‌బ‌డ్డారు. సీమ‌కు నీళ్ల విష‌యంలో జ‌రుగుతున్న అన్యాయాన్ని అనేక వేదిక‌ల‌పై ప్ర‌శ్నించారు. ఇక‌, తెలంగాణ ఉద్య‌మం రాజుకోవ‌డంతో ఆయ‌న టీడీపీ నుంచి 2012లో బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. తెలంగాణ త‌ర‌హాలోనే త‌మ ప్రాంతం కూడా వెనుక‌బ‌డి ఉంద‌ని, దీనిని కూడా రాష్ట్రంగా గుర్తించాల‌ని డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2013లో రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి(ఆర్‌ పీ ఎస్‌)ను స్థాపించారు.

తెలంగాణ ఇచ్చేట‌ట్ట‌యితే రాయ‌ల‌సీమ‌ను కూడా ప్ర‌త్యేక రాష్ట్రంగా గుర్తించాల‌నే డిమాండ్‌ తో అనేక ఉద్య‌మాల‌కు ఊపిరిలూదారు. నిరాహార దీక్ష‌కు సైతం దిగారు. నాలుగు నెల‌ల‌పాటు సుదీర్ఘ ట్రాక్ట‌ర్ యాత్ర‌ను చేశారు. మొత్తం గా సీమ‌లోని 3 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని ఆయ‌న ప్ర‌యాణించి సీమ క‌ష్టాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌త్యేక రాష్ట్రంగా ఎందుకు మార్చాలో వివ‌రించారు. అదేవిధంగా గ‌త ఏడాది 2016 ఫిబ్ర‌వ‌రిలో గ్రామీణ బ‌స్సు యాత్ర ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే రాయ‌ల తెలంగాణకు వ్య‌తిరేకంగా కూడా ఉద్య‌మించారు. అయితే, ఆయ‌న పోరాటానికి స‌రైన మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు.

దీంతో త‌న పార్టీని మూసివేస్తున్నట్టు బైరెడ్డి రాజశేఖరరెడ్డి వెల్ల‌డించి ఆయ‌న అభిమానుల‌ను షాక్‌ కు గురి చేశారు. ``రాయలసీమ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాను కానీ, వారి నుంచి సరైన ప్రోత్సాహం తనకు లభించలేదు`` అని బైరెడ్డి నిర్వేదం వ్య‌క్తం చేశారు. తాను త్వ‌లోనే ఏ పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానన్నారు. అయితే, టీడీపీలో చేరమని బైరెడ్డి అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మ‌రోప‌క్క‌, సీమ‌లో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం బైరెడ్డికి వెల్‌ కం చెప్పందుకు రెడీగా ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.