Begin typing your search above and press return to search.

తట్టా బుట్టా సర్దుకుంటున్న మహిళా నేత... ?

By:  Tupaki Desk   |   22 Jan 2022 6:10 AM GMT
తట్టా బుట్టా  సర్దుకుంటున్న మహిళా నేత... ?
X
ఎన్నికలకు చాలా దూరం ఉంది. అయితే రాజకీయ నేతలకు ముందు చూపు ఎక్కువ కదా. ముందే బెర్త్ కన్ ఫర్మ్ చేసుకుంటే ఫ్యూచర్ కి ఎలాంటి ఢోకా ఉండదని భావించే బాపతు అంతా ఇపుడు సీట్ల వేటలో తెగ బిజీ అవుతున్నారు. ఈ విధంగా ఆలోచించేవారిలో ఆవేశపడో అత్యాశపడో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారే ఎక్కువ మంది ఉండడం విశేషం. ఉన్న పార్టీలో విలువ లేదు. ఇలాగే ఉంటే అసలు ఉనికే లేకుండా పోతుంది అన్న ఆవేదనతో ఉన్న వారు అంతా వేరే రూటు చూసుకుంటున్నారు.

అలా రాయలసీమలో కీలక జిల్లాగా ఉన్న కర్నూల్ లో మాజీ ఎంపీ బుట్టా రేణుక తట్టా బుట్టా సర్దుకునే పనిలో పడ్డారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. నిజానికి ఆమెను రాజకీయాల్లొకి తెచ్చి ఫస్ట్ టైమ్ ఎంపీని చేసింది వైసీపీనే. 2014 ఎన్నికల్లో కర్నూల్ నుంచి లోక్ సభకు రేణుకకు టికెట్ ఇచ్చి జగన్ గెలిపించుకున్నారు. అయితే గెలిచిన మూడేళ్ళకే ఆమె టీడీపీలోకి వెళ్లిపోయారు. అంతకు ముందే ఆమె భర్త టీడీపీతో మంతనాలు ఆడి అంతా సిద్ధం చేసి ఉంచారని అంటారు.

ఇక టీడీపీలో ఆమె బ్రైట్ ఫ్యూచర్ ని ఆశించారు. కానీ అక్కడ కూడా సీన్ రివర్స్ అయింది. కర్నూల్ ఎంపీ టికెట్ ని కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాశరెడ్డికి చంద్రబాబు ఇచ్చారు. అలాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కలేదు. దాంతో ఆమె ఫ్లేట్ ఫిరాయించి మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు. కానీ జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ టైమ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

మరి కొద్ది నెలల్లో మూడేళ్ళు నిండిపోతాయి. అయినా కూడా రేణుక ఆశిచిన పదవులు ఏవీ వైసీపీలో దక్కలేదు. ఆమె రాజ్యసభ కోరుకున్నారు. ఇక ఎమ్మెల్సీ అయినా ఇస్తారని భావించారు. ఈ మేరకు జగన్ని పలుమార్లు కలిశారు కూడా. ఇదిలా ఉంటే ఒకసారి పార్టీని కాదని చెప్పి బయటకు వెళ్లి వచ్చిన వారికి జగన్ పదవులు ఇవ్వరని పార్టీలో ఒక అగ్ర నేత నుంచి ఆమెకు సమాచారం లీక్ అవడంతో ఇక వైసీపీలో ఉండడం వేస్ట్ అని భావిస్తున్నారుట.

దీంతో టీడీపీతో రాయబేరాలు కూడా నడిచాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ టికెట్ ని రేణుక ఆశిస్తున్నారు. సీనియర్ మోస్ట్ అయిన కోట్ల సూర్య ప్రకాశరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకూడదని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది అంటున్నారు. దాంతో బుట్టా రేణుకకు లైన్ క్లియర్ అంటున్నారు. ఒకవేళ ఈ కారణం చేత అయినా ఎంపీ టికెట్ రాకపోయినా ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఖాయం అంటున్నారు.

కర్నూల్ జిల్లాలో బలమైన చేనేత సామాజికవర్గానికి చెందిన రేణుకకు టికెట్ ఇస్తే బీసీలు అంతా తమ వెంట ఉంటారని టీడీపీ కూడా అంచనా వేసుకుంటోందిట. మొత్తానికి అటూ ఇటూ కూడా అంతా ఒకేగా ఉన్న పరిస్థితి ఉంది అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఏ సమయంలో అయినా తట్టా బుట్టా సర్దుకుని ఈ మహిళా నేత వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేయడం ఖాయమనే జిల్లాలో టాక్ గట్టిగా వినిపిస్తోంది.